గంజి ప్రసాద్ హత్యకు రెండు రోజుల రిక్కీ - 12 మందిపై కేసు నమోదు : ఆ వ్యక్తి ప్రోద్బలంతో..!!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో మెుత్తం 12 మందిపై కేసులు నమోదు చేయగా.. ఆరుగురి ని అరెస్ట్ చేసారు. తొలి నుంచి అనుమానిస్తున్నట్లుగానే ప్రధాన నిందితుడు బజారయ్య ప్రోద్బలంతోనే హత్య జరిగినట్లు ఎస్పీ రాహుల్ దేవ్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ గత నెల 30న హత్యకు గురయ్యారు.
గ్రామంలోని వైకాపాలో రెండు వర్గాలు ఉన్నాయని.. అందులో ఓ వర్గానికి ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం వల్లే.. గంజి ప్రసాద్ హత్య జరిగిందంటూ ఒక వర్గం ఆందోళనకు దిగింది. హతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావును ప్రత్యర్ధి వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే పైన దాడికి దిగింది. దీంతో..పోలీసులు మూడు గంటల సేపు ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచి ఆ తరువాత అక్కడ నుంచి తప్పించారు. న భర్తను ఎమ్మెల్యే తలారి వెంకట్రావే చంపించాడని గంజి ప్రసాద్ భార్య సత్యవతి ఆరోపణలు చేశారు.
తనకు అనుకూలంగా ఉన్న వర్గాన్ని ప్రోత్సహించి, హత్య చేయించారని ఆమె వాపోయారు. ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడంతో పాటు గంజి ప్రసాద్ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని సత్యవతి డిమాండ్ చేశారుఇక, ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. కేసులో బజారయ్య, సురేశ్, మోహన్కుమార్, హేమంత్, గంజి నాగార్జున, రెడ్డి సత్యనారాయణలను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు బజారయ్య ప్రోద్బలంతోనే హత్య జరిగిందన్నారు.
ఏప్రిల్ 26న నిందితుడు సురేష్ కత్తులు సేకరించాడని.. మూడు రోజల పాటుగా గంజి ప్రసాద్ రాకపోకలను నాగార్జున గమనించాడని వివరించారు. ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రసాద్ రాకపోకలను గమనిస్తూ.. సురేశ్, హేమంత్ బైకుపై గంజి ప్రసాద్ను వెంబడించారు. గంజి ప్రసాద్ హత్యలో మరికొందరి ప్రమేయం ఉందని, విచారణ తర్వాత వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ రాహుల్ దేవ్శర్మ తెలిపారు. రెడ్డి సత్యనారాయణ ఇంట్లో జరిగిన ఓ వేడుకలో గంజి ప్రసాద్ హత్యకు ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రెండు బైక్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. చాలాకాలం నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, అవి చినికి చినికి గాలివానగా మారి, గంజి ప్రసాద్ను బలి తీసుకున్నాయి. ఈ గొడవల్ని సరి చేయడంలో విఫలమవ్వడంతో, ద్వారక తిరుమల ఎస్సైను సస్పెండ్ చేశారు.