హవాలా ముఠా పట్టివేత: గ్యాంగ్ లీడర్ గుజరాతీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర టాస్క్ఫోర్స్ పోలీసులు ఓ హవాలా రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఆరుగురు సభ్యులు గల ఓ హవాలా ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ద్వారా పెద్ద మొత్తంలో హవాలా డబ్బు చేతులు మారిందని జెసి అంజనీ కుమార్ వెల్లడించారు.
ఇదంతా గుజరాత్ గ్యాంగ్ లీడర్ విజయ్ ముఠా పనిగా గుర్తించామని ఆయన అన్నారు. ఈ ముఠా లావాదేవీలన్నింటినీ ఫోన్ ద్వారా నిర్వహించారని చెప్పారు. రూ. 10, 5 నోట్లపై ఉండే సిరీస్ను పాస్వర్డ్గా వాడి లావాదేవీలను నడిపించారని చెప్పారు. అయితే, స్వాధీనం చేసుకున్న డబ్బును, అరెస్టు చేసిన నిందితులను కేసు విచారణ నిమిత్తం ఆదాయం పన్ను శాఖకు అప్పగిస్తామని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో దొంగల నుంచి 20 ద్విచక్ర వాహనాలను, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు డిగ్రీ చదువుతున్న విద్యార్థులేనని పోలీసులు చెప్పారు.
ఇదిలావుంటే, హైదరాబాదు నగరంలోని మాదాపూర్లో ఓ మహిళపై దారుణమై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళ కాళ్లు నరికి వేశారు. ఈ దారుణం మాదాపూర్లోని పర్వత్ నగర్లో చోటు చేసుకుంది.