అశ్లీల డ్యాన్స్, రేవ్పార్టీ భగ్నం: బాత్రూంలో శిశువు బాడీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని శివారులో గల యాప్రాల్లో రేవ్ పార్టీ పైన సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువతులు సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.41,910 స్వాధీనం చేసుకున్నారు.
యాప్రాల్ రేవ్ పార్టీ పైన పోలీసులకు ఫిర్యాదు అందింది. యువతీ, యువకులు అశ్లీల నృత్యాలు చేస్తూ తమను డిస్టర్బ్ చేస్తున్నారని సమాచారం అందింది. దీంతో పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న అపార్టుమెంటు పైన దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
గాంధీ ఆస్పత్రిలో దారుణం
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని దుండగులు బాత్రూంలో పడేసి వెళ్లిపోయారు. ఆస్పత్రి సిబ్బంది శిశువు మృత దేహాన్ని వెలికి తీసి, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆడపిల్లగా పుట్టడమే శిశువును వదిలివేయడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. సీసీ కెమెరాల పూటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో శిశువును ఎవరు బాత్రూంలో వదిలేసి వెళ్లింది తెలిసే అవకాశం ఉంది.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 25 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 15 గంటలు, నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. తిరుమలలో శనివారం రద్దీ ఎక్కువగా ఉంది. మహా లఘులో దాదాపు 75 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 22 గంటలు, దివ్యదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని అధికారులు ప్రకటించారు. రూ.50 అడ్వాన్సు బుకింగ్ టికెట్ల జారీని క్రమబద్ధీకరించారు.
ప్రకాశం జిల్లాలో మావోయిస్ట్ డంప్
ప్రకాశం జిల్లాలో ఆదివారం మావోయిస్టులకు చెందిన ఓ భారీ డంప్ లభ్యమైంది. రాచర్ల మండలం ఆకివీడు వద్ద బయటపడ్డ ఈ డంప్ లో ఆయుధాలతో పాటు రూ.60 లక్షల మేర నగదు బయటపడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
అనుమానితులిద్దరినీ రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు మరిన్ని వివరాలు రాటబ్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మావోయిస్టుల డంప్లో ఆయుధాలు పెద్ద ఎత్తున లభిస్తున్నప్పటికీ భారీ మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆదివారం దొరికిన డంప్లో రూ.60 లక్షలుండటంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.