తునిలో సాధారణ పరిస్థితులు: 144 సెక్షన్, పలు రైళ్ల పునరుద్ధరణ
తుని: కాపు గర్జన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతంలో పోలీసులు మెహరించారు. ప్రధాన కూడళ్లతో పాటు బస్టాండు, రైల్వేస్టేషన్ లాంటి ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో తుని పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఆదివారం ఘటనలతో భయాందోళనలకు గురై ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన పట్టణ ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. తునిలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సుమారు 3 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

మరోవైపు తుని ఘటనపై విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఆదివారం జరిగిన ఘటనపై మొత్తం 20 కేసులను పోలీసులు నమోదు చేశారు. దీంతో తునితో పాటు విశాఖపట్నంలో కూడా 144 సెక్షన్ అమలవుతోంది. అయితే సోమవారం ఉదయానికి ఉద్రిక్తత కొంతవరకు సడలింది.
దీంతో ఈ మార్గంలో పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ఆదివారం రాత్రి 9.30 సమయంలో ముద్రగడ పద్మనాభం ప్రకటించిన సంగతి తెలిసిందే. తుని ప్రాంతంలో పరిస్థితి మాత్రం పూర్తిగా అదుపులోనే ఉంది.

మరోవైపు ఆందోళనకారులు తగలబెట్టిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలన్నీ పూర్తిగా తగలబడ్డాయి. కాపులను బీసీలలో చేరుస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేసిన ముద్రగడ పద్మనాభం సోమవారం సాయంత్రం వరకు సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు.

అయితే ఆయన దీక్ష ఎక్కడ చేస్తారో తెలియక పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడిలో ఉన్నారు. పరిసర ప్రాంత వాసులతో పాటు పలు జిల్లాల నుంచి వచ్చిన కాపు నాయకులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆదివారం నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఆయన తన ఇంట్లోనే దీక్ష చేయొచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications