బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై పోలీసు కేసు ... రీజన్ ఇదే !!
బిజెపి మహిళా నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదయ్యింది. ఇటీవల జరిగిన అయోధ్య రామ మందిర శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే ఛానల్లో ఎందుకు ప్రచారం చేయలేదని ఆమె టిటిడిపై చేసిన వ్యాఖ్యలకు గాను టిటిడి విజిలెన్స్ విభాగం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాధినేని యామినిపై టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు .. కేసు నమోదు
తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఆమెపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఏపీ మహిళా బీజేపీ నేత సాధినేని యామిని సోషల్ మీడియాలో టీటీడీపై కామెంట్లు చేయడంతో టీటీడీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె అనుచితమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు టిటిడి విజిలెన్స్ అధికారులు.
దీంతో సాధినేని యామిని పై ఐపీసీ సెక్షన్ 505(2), 500 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

అయోధ్య రామమందిర శంకుస్థాపన సందర్భం.. టీటీడీపై సాధినేని యామిని విమర్శలు
సాధినేని యామిని అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమం రోజు తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహించే ఎస్ వి బి సి భక్తి ఛానల్ లో రామమందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని ,హిందువుల కోసం, ధార్మిక కార్యక్రమాల కోసం నిర్వహించే ఛానల్లో అయోధ్య రామ మందిర శంకుస్థాపన ప్రసారం చేయకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఏపీలో హిందూ దేవాలయాలపై , హిందూ ధర్మంపై వివక్ష కొనసాగుతుందని , హుండీల్లో వేసిన ముడుపులు అన్యమతాల కోసం వినియోగిస్తున్న పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

టీటీడీ భక్తి ఛానల్ లో మోడీ కార్యక్రమం ప్రసారం చెయ్యలేదని ఆగ్రహం
తిరుమలకు వెళ్లే రాజకీయ ప్రముఖుల, స్వామీజీలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేసే టిటిడి చరిత్రలో నిలిచిపోయే రామమందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రసారం చేయకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తీసిందని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా రామమందిర శంకుస్థాపన ఆసక్తిగా తిలకిస్తే హిందువుల కోసం నిర్వహించే ఛానల్ లో ప్రసారం చెయ్యకపోవటం దారుణం అని ఆమె ఫైర్ అయ్యారు.

టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిందని కేసు నమోదు
ఈ నేపథ్యంలోనే టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి నేత సాధినేని యామినిపై కేసు నమోదు అయింది. సాధినేని యామిని గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. నాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న , ప్రస్తుత అధికార పార్టీపై, జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాల తరువాత సైలెంట్ అయిన సాధినేని యామిని,పార్టీ ఫిరాయించి జాతీయ పార్టీ అయిన బిజెపిలో చేరారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో కీలకమైన మహిళా నేతగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications