తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటికి ఎలా వస్తారో మేమూ చూస్తాం..??
సెప్టెంబరు ఒకటోతేదీ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు కోసం ప్రయత్నాలు చేస్తోన్న ఉద్యోగులంతా ఆరోజు మిలియన్ మార్చ్ ప్రకటించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసాన్ని ముట్టడించబోతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు ఒకటోతేదీన మార్చ్ తోపాటు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి, విజయవాడ నగరంలో ప్రదర్శన, సభ నిర్వహించబోతున్నట్లు ప్రకటించాయి. ఆరోజు వీరిని ఎలా కట్టడి చేయాలా? అన్న అంశంపై పోలీసులు లోతుగా ఆలోచిస్తున్నారు.
Recommended Video

భయపెడుతున్న గత అనుభవం
పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో చలో విజయవాడ నిర్వహించారు. ఉద్యోగులను విజయవాడ రాకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్నిరకాలుగా ప్రయత్నించినా పోలీసుల కళ్లుగప్పి మారువేషాల్లో ఉద్యోగులు భారీసంఖ్యలో విజయవాడకు చేరుకున్నారు.
మూడోతేదీకంటే రెండురోజులు ముందుగానే నగరానికి వచ్చి స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో దిగారు. మరికొందరు హోటల్స్ లో దిగారు. పోలీసులు కేవలం రైళ్లు, బస్సులు, హోటల్స్ లోనే తనిఖీలు చేయడంతో వారికి ఎటువంటి అనుమానం రాలేదు. కానీ బీఆర్ ఎటీఎస్ రోడ్డుపై మాత్రం వేల సంఖ్యలో ఉద్యోగులు ఒక్కసారిగా చేరుకోవడంతో ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది.

ముందుగానే తనిఖీలు
శాతవాహన కళాశాలలో సభ నిర్వహించడం కోసం అనుమతివ్వాలంటూ ఉద్యోగులు దరఖాస్తు చేశారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందన్న కారణంతో పోలీసులు దాన్ని తిరస్కరించారు. ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు జరగకూడదంటూ ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఆదేశాలుండటంతో ఈసారి ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఫంక్షన్ హాళ్ళ యజమానులకు హెచ్చరికలు
లాడ్జీలు, హోటళ్లను తనిఖీ చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొనేవారికి గదులిస్తే హోటల్స్, లాడ్జిల యజమానులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఒకేసారి ఎక్కువ గదులు బుక్ చేసేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హోటళ్లు, ఫంక్షన్హాళ్ల యజమానులకు పోలీసులు సూచించారు. ఉద్యోగులందరికీ 149 సీఆర్పీసీ నోటీసులు ఇస్తూ సీపీఎస్ ఆందోళనల్లో పాల్గొనకూడదని హెచ్చరికలు జారీచేస్తున్నారు.

పట్టుదలగా ఉన్న పోలీసులు
మిలియన్ మార్చ్ ను విఫలం చేయడానికి పోలీసులు వ్యూహరచన చేస్తున్నారు. సెప్టెంబరు 1న సీఎం జగన్ కడప జిల్లా ఇడుపులపాయ పర్యటనకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కాన్వాయ్ జాతీయ రహదారి మీదుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లాలి. సీఎం కాన్వాయ్కు ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఇప్పుడు పోలీసులు దృష్టిసారించారు. గతంలో ఉద్యోగులు మధురానగర్, గుణదల లాంటి నగర శివారు ప్రాంతాల నుంచి బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకున్నారు. శివారు స్టేషన్లలో నిఘా లేకపోవడంతోనే వారు అక్కడికి చేరుకోగలిగారని ఈసారి అటువంటి పరిస్థితిని పునరావృతం కానివ్వకూడదనే పట్టుదలతో పోలీసులున్నారు.












Click it and Unblock the Notifications