ఏమైంది?: పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ గొడవపై విచారణ
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో తెలుగు సినీ హీరోలు ప్రవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య చెలరేగిన వివాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. భీమవరంలో శుక్ర, శనివారాలు 144వ సెక్షన్ విధించారు. హీరోల అభిమానులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమవరంలో ఆయన అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అయితే, ప్రభాస్ అభిమానులే ఆ పనిచేశారనే ఆగ్రహంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు.
ఆందోళనకు దిగిన పవన్ అభిమానులు ప్రభాస్ ఫ్లెక్సీలను చించేసి, నిప్పు పెట్టారు. రోడ్డు పక్కన ఉన్న షాపులను ధ్వంసం చేశారు. రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘనటపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల ఏర్పాటు చేసిన సమయంలోనే బాహుబలి పోస్టర్లు కూడా వెలిశాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టి ప్రభాస్ అభిమానులపైకి వెళ్లింది.
దాంతో ఇరువురు హీరోల అభిమానుల మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తింది. ఇరువురి అభిమానుల మధ్య ఘర్షణ కొత్త మలుపు తిరిగింది. అది రెండు సామాజిక వర్గాల మధ్య వివాదంగా మారే పరిస్థితి దాపురించింది. దాంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రంగంలోకి దిగారు.