అనంతపురం బ్యాంకు దోపిడీలో పోలీసుల కీలక పురోగతి:సిలిండరే ఆధారం!
అనంతపురం:నగరంలోని జేఎన్టీయూ క్యాంపస్ ఎస్బీఐ శాఖలో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. నిందితులు సంఘటనా స్థలంలో వదిలివెళ్లిన గ్యాస్ సిలిండర్ ఆధారంగా వారి గురించి పోలీసుల తెలిసిపోయినట్లు సమాచారం.
నిందితులు ఘటనా స్థలంలో వదిలివెళ్లిన సిలిండర్ ను బెంగుళూరులో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తాము ఆర్మీ అధికారులమని చెప్పి వారు ఈ సిలిండర్ ను బెంగళూరులో కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణ వెల్లడయింది. దీంతో పోలీసులు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన నిందితుల చిత్రాలను సేకరించి ఇక్కడ సిసి ఫుటేజ్ తో పోల్చి చూడనున్నారు. దీంతో నిందితులను త్వరలోనే పట్టుకోగలమన్న ధీమా పోలీసుల్లో వ్యక్తం అవుతోంది.

సిలిండరే...ఆధారం
అనంతపురం జేఎన్టీయూ ఎస్బీఐ బ్రాంచిలో శనివారం తెల్లవారుజామున జరిగిన భారీ దోపిడీకి సంబంధించి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఒక చిన్న ఆధారంతో ఇది సాధ్యమైనట్లు తెలిసింది. తమకు లభించిన ఆధారాలతో త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్న ధీమా పోలీసుల్లో వ్యక్తమవుతోంది.
ఇద్దరు దొంగలు మాస్క్లు ధరించి, చేతికి గ్లౌజ్లు వేసుకుని బ్యాంకులోకి చొరబడ్డారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అలారం మోగకుండా తీగలు తొలగించారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. అయితే వారు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్, కట్టర్లను అక్కడే వదిలేశారు. ఆ సిలిండర్ ఆధారంగా పోలీసులు కూపీ లాగడం ఆరంభించారు.

పోలీసుల వ్యూహం...పనిచేసింది
దొంగలు వాడిన సిలిండర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు విచారణ ఆరంభించారు. దానిపై ఉన్న నంబర్ల ఆధారంగా అది బెంగళూరు నుంచి తెచ్చినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు బెంగళూరుకు వెళ్లి సిలిండర్ ఇచ్చిన దుకాణంలో విచారణ జరిపారు. తాము ఆర్మీకి చెందిన అధికారులమంటూ చోరులు దుకాణంలో పరిచయం చేసుకున్నట్లు తెలిసింది. తమ వాహనం మరమ్మతులకు గురైందని, దానికి వెల్డింగ్ చేయాలని సిలిండర్, ఇతర పరికరాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆర్మీ పేరు చెప్పడంతో దుకాణదారుడు ఇతర వివరాలేవీ అడగలేదు. అయితే అక్కడి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి, నిందితుల చిత్రాలు తీసుకున్నట్లు తెలిసింది. వాటి ఆధారంగా విచారణ మొదలైంది.

నార్త్ ఇండియాకి...చెందినవారు?
బెంగళూరులోని సీసీ టీవీ పుటేజీలో లభించిన చిత్రాలు, అక్కడ నిందితులు మాట్లాడిన వివరాల ఆధారంగా బ్యాంకులో చోరీకి పాల్పడింది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముఠాయేనని పోలీసులు దాదాపు నిర్ధారించుకున్నారు. అక్కడ సిసి కెమేరాల్లో లభ్యమైన చిత్రాల ఆధారంగా కొన్ని బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపారు. ఓ బృందం మహారాష్ట్రకు వెళ్లింది. ఒకటి, రెండు రోజుల్లో చోరుల వివరాలు పూర్తిగా సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు చాకచక్యంగా విచారణ జరుపుతున్నారు. అలాగే చోరులు ఇద్దరూ బ్యాంకు వద్దకు కారులో వచ్చినట్లు తెలుస్తోంది. ఓ కారు అర్ధరాత్రి ప్రాంతంలో బ్యాంకు వద్దకు వచ్చి వెళ్లింది. ఈ కారులోనే చోరులు సామగ్రితో వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు నంబరును గుర్తించి ఆ కోణంలో కూడా వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.

మకాం ఎక్కడ వేశారో...తేలాలి
అయితే ఈ కారుకు ఉన్న నంబరు అసలైనదా.. కాదా?...అనే కోణంలో విచారణ జరుగుతోంది. దోనిడీ అనంతరం నగదు తీసుకుని కారు వద్దకు ఎలా చేరుకున్నారు, అక్కడి నుంచి ఎటు వెళ్లిపోయారు అనే కోణంలోనూ విచారిస్తున్నారు. అలాగే బ్యాంకు సిబ్బంది సహకారం ఉందా?...అనే కోణంలోనూ విచారణ సాగించి ఒకరిపై అనుమానం రావడంతో విచారించి వదిలేసినట్లు సమాచారం. సాధారణంగా అంతర్రాష్ట్ర ముఠాలు స్థానికుల సహకారం తీసుకునేందుకు ఆసక్తి చూపరని పోలీసులు అంటున్నారు. చోరులు కనీసం నాలుగు రోజుల ముందే జిల్లా కేంద్రానికి వచ్చివుంటారని...ఎక్కడో షెల్టర్ తీసుకొని ఉంటారని...ఆ షెల్టర్ ఎక్కడో తెలుసుకునే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications