న్యూ ఇయర్: పోలీసుల తనిఖీలు, 'జిహెచ్ఎంసి' సమ్మె
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. 2014 సంవత్సర వేడుక నేపథ్యంలో ఐబి నగర పోలీసులను అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు షాపింగ్ మార్స్, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
వెస్ట్ జోన్ పరిధిలోని పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంబజార్ తదితర ప్రాంతాలలో తనిఖీలు చేపట్టి, భద్రతా చర్యలు విస్మరించిన షాపింగ్ మాల్స్కు నోటీసులు జారీ చేశారు. నగరంలో పోలీసులు తుపాకులతో డెకాయిట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చెకింగ్ సరిగా లేకుంటే నోటీసులు జారీ చేస్తున్నారు.
అర్ధరాత్రి నుండి జిహెచ్ఎంసి సిబ్బంది సమ్మె
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ సిబ్బంది (జిహెచ్ఎంసి) సమ్మె సైరన్ మోగించారు. గురువారం అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తున్నట్లు జిహెచ్ఎంసి సంఘం అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని, అందుకే మళ్ళీ సమ్మె చేయవలసి వస్తుందని అన్నారు.
ప్రతి కార్మికుడి కనీసం వేతనం రూ. 16,500 ఉండాలని గోపాల్ అన్నారు. ప్రతి కార్మికుడు చేతులకు గ్లౌజులు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటే సమ్మెను విరమిస్తామని గోపాల్ స్పష్టం చేశారు. ఈ సమ్మెలో దాదాపు ఇరవై అయిదే వేల మంది పాల్గొననున్నారు.