వైసీపీ నాయకుల వింత సమాధానాలు విని విసిగిపోయాం, పోలీసులు
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నాయకులు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, వారు చెప్పే సమాధానాలు విని విసిగిపోతున్నామని, ఆ కేసు దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారి శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. ఈ కేసులో విచారణలో భాగంగా బుధవారం వైసీపీ ఎమ్మెల్సీ, న్యాయవాదిని మంగళగిరి పోలీసు అధికారులు విచారణ చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, న్యాయవాది బగ్గు గవాస్కర్ ను మంగళగిరి పోలీసులు వేర్వేరుగా విచారణ చేశారు. ఈ సందర్భంగా మేము అడిగిన ప్రశ్నలకి వైసీపీ నాయకులు సరైన సమాధానం చెప్పడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. ఉదయం 11 గంటలకి న్యాయవాది గవాస్కర్ విచారణ హాజరైనారు. సుమారు గంటపాటు న్యాయవాది గవాస్కర్ ను పోలీసులు విచారణ చేశారు. ఆ సందర్భంగా మేము అడిగిన ప్రశ్నలకి న్యాయవాది గవాస్కర్ సరైన సమాధానాలు చెప్పలేదని మంగళగిరి పోలీసు అధికారులు అంటున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు న్యాయవాది గవాస్కర్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్లిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. చెప్పిన టైం కంటే చాలా ఆలస్యంగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 ప్రశ్నలు అడిగామని, ఆ ప్రశ్నలకి ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పారని పోలీసు అధికారులు చెప్పారు. విచారణ సమయంలో మాకు ఇచ్చిన అడ్రస్ లో వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేరని, ఆయన వేరే చిరునామాలో ఉంటున్నారని, ఆయనకు సమాచారం ఇవ్వడం కూడా ఇబ్బందిగా మారిందని పోలీసు అధికారులు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలకి ఆ పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి డబ్బులు ఇచ్చినట్లు తమ దగ్గర సమాచారం, సాక్షాలు ఉన్నాయని, అందుకు ఆయన్ను బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వమంటే ఆ వివరాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారని పోలీసు అధికారులు తెలిపారు, దర్యాప్తులో భాగంగా మొబైల్ ఫోన్లు ఇవ్వాలని వైసీపీ నాయకుడు అప్పిరెడ్డికి, న్యాయవాది గవాస్కర్ కి తాము సూచించామని, అయితే మొబైల్ ఫోన్లు ఇవ్వడానికి నిరాకరించిన వారు అక్కడి నుండి వెళ్లిపోయారని మంగళగిరి పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications