ఒత్తిడితోనే ఉదయ్ సూసైడ్: ఆరేళ్లుగా మాటల్లేవని తండ్రి
హైదరాబాద్: హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు పరిశీలించారు. ఆయన భార్య, అత్తమామలు, అపార్టుమెంట్ వాచ్మెన్ను ప్రశ్నించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు మిత్రులకు ఎస్సెమ్మెస్లు చేసినట్లుగా తెలుస్తోంది.
అనుమానాస్పద మృతిగా...
ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మృతిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తల్లి చనిపోవడంతో ఉదయ్ బాగా కలత చెందారు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారనే వాదనలు ఉన్నాయి. అవి కూడా ఆయనను బాధించాయంటున్నారు. సూసైడ్ నోట్ ఏదీ దొరకలేదన్నారు.
ఉదయ్ సోదరుడు కూడా అంతకుముందు ఆత్మహత్య చేసుకున్నాడు. అవకాశాలు సరిగా లేకపోవడంతో చెన్నై వెళ్లి ప్రయత్నాలు చేసి, తిరిగి హైదరాబాదుకు వచ్చారు. మానసికంగా క్రుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. తాను చనిపోతానని భార్యతో పలుమార్లు ఉదయ్ అన్నారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఉదయ్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్లో ఎవరూ లేరు
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూలేరని ఆపార్టుమెంట్ వాచ్మెన్ పోలీసులకు తెలిపాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఓ వేడుకలో పాల్గొనేందుకు ఆయన భార్య బయటకు వెళ్లారని, ఒంటిగంట సమయంలో భార్య, అత్తమామలు హడావుడిగా ఇంటికి వచ్చారని, అనంతరం అరుపులు వినిపించాయన్నారు.
ఏళ్లుగా మాటల్లేవు
ఉదయ్ కిరణ్తో ఆరేడేళ్లుగా మాటల్లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని తండ్రి వివికె మూర్తి అన్నారు. ఉదయ్కి పెళ్లైన విషయమే తనకు తెలియదన్నారు. తనకు తెలిసినంత వరకు ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు.