ఫ్లెక్సీ ఫైట్ : బాబు ఫ్లెక్సీలకే అనుమతి.. వైసీపీకి 'నో ఛాన్స్'
విజయవాడ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో.. ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బలవంతంగా తొలగించేందుకు సిద్దమయ్యారు కృష్ణా పోలీసులు. పార్టీ సొంత భవనాలపై ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను సైతం తొలగించాలని ఆంక్షలు విధించడం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మినహా.. మరే ఫ్లెక్సీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఫ్లెక్సీల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న వైసీపీ నేతలు జోగి రమేశ్, నాగిరెడ్డి.. పోలీసుల తీరుపై నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.
పుష్కరాలకు వచ్చే భక్తులను స్వాగతిస్తూ.. 'ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం తప్పా..!' అంటూ వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారని సమాచారం. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వైసీపీ శ్రేణులకు నడుమ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.