పోలీసుల ఓవరాక్షన్: అయ్యవార్ల ఆందోళన, పురోహితుడి నిజాయితీ
రాజమండ్రి: రాజమండ్రిలో పురోహితులు ఆందోళనకు దిగారు. గోదావరి మహా పుష్కరాల్లో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారంటూ ప్రధాన ఘాట్ వద్ద అయ్యవార్లు నిరసనకు దిగారు. భక్తులచేత పిండ ప్రదానాలు చేయించేందుకు గాను ఘాట్లలోకి మమ్మల్ని అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారు.
పోలీసులు దరుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పిండ ప్రదానాలకు ప్రభుత్వమే రూ. 300గా ధర నిర్ణయించిందని తెలిపారు. అయితే కొంత మంది భక్తులు వారికి తోచినంత ఇస్తున్నప్పటికీ, అందుకు పోలీసులు అంగీకరించడం లేదని పేర్కొన్నారు.
పురోహితులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను ఇచ్చినా వాటి వల్ల ఉపయోగం లేదని తెలిపారు. బ్రాహ్మాణులు కాని వారు కూడా పిండ ప్రదానాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో ఉన్న అన్ని ఘాట్లలో బ్రాహ్మాణులను ఒకేలా చూడటం లేదన్నారు.
ప్రధాన ఘాట్లైన కోటి లింగాలు, కోటగుమ్మం ఘాట్ల వద్ద ఉన్న పురోహితులపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. గురువారం అమావాస్య కావడంతో శుక్రవారం పిండ ప్రదానాలు చేసే వారు అధికంగా తరలివస్తున్నారు.
గోదావరిలో పుష్కర స్నానం చేసి గోదావరి సంకల్పాన్ని చెప్పించుకుంటే సర్వ పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. రాజమండ్రిలో పురాతన ఘాట్లైన కోటిలింగాల, కోటగుమ్మంలలో భక్తులు పుష్కర స్నానాలకు వినియోగిస్తున్నందున బ్రాహ్మాణులను అక్కడికి పోలీసులు అనుమతించడం లేదు.
దీని ఫలితంగా గోదావరి సంకల్పానికి భక్తులు దూరమవుతున్నారు.
పుష్కరాల్లో పురోహితుడి నిజాయితీ:
రాజమండ్రి పుష్కరాలకు వస్తున్న భక్తుల వద్ద దొంగలు దొంగతనం చేస్తుంటే, తనకు దొరికిన పర్సుని పోలీసులకు అప్పగించాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రి వీఐపీ ఘాట్లో రాజమండ్రి మార్కండేయ స్వామి ఆలయ పూజారి కంట్రోల్ రూమ్లో ఉన్న పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతడి నిజాయితీని మెచ్చుకున్నారు.