అనంతపురంలో ఐసిస్ కలకలం: మకాం వేశారా?, భారీగా సోదాలు
అనంతపురం: ఐసిస్ ఉగ్రవాదులు మకాం వేశారనే అనుమానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో కలకలం రేగింది. ఐసిసి ఉగ్రవాదులు మకాం వేశారని అనుమానించిన పోలీసులు పెద్దయెత్తున తనిఖీలు, సోదాలు నిర్వహించారు. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఆ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదంటూ శనివారం వార్తలు వచ్చాయి. ఐసిస్కు చెందిన ఉగ్రవాదులు మారువేషంలో వచ్చి అనంతపురంలో మకాం వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్లో ఐసిస్ సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్ఐఏ అదుపులో ఉన్న మహ్మద్ యజ్దాని, ఇబ్రహీం అనంతపురం వచ్చినట్లు విచారణలో తేలినట్లు చెబుతున్నారు. దీంతో అప్రత్తమైన జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని పోలీసులు లాడ్జిలు, అపార్ట్మెంట్లలో సోదాలు నిర్వహించారు.
గత కొన్ని రోజులుగా లాడ్జిల్లోకి ఎవరెవరు వచ్చారనే వివరాలను కూడా పోలీసులు పరిశీలించారు. అయితే, ఐసిసి ఉగ్రవాదులు అనంతపురం వచ్చారా, లేదా అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించడం లేదు. సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుని, రికార్డులు సరిగా నిర్వహించని లాడ్జీలపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications