ముద్రగడ గృహ నిర్బంధం: కిర్లంపూడిలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు
కాపు రిజర్వేషన్ల కోసం పాదయాత్ర తలపెట్టిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను ఆయన ఇంటి గేటు ముందే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ్నుంచి ఆయన్ను ముందుకు కదలనీయట్లేదు.
తూర్పుగోదావరి: కాపు రిజర్వేషన్ల కోసం పాదయాత్ర తలపెట్టిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను ఆయన ఇంటి గేటు ముందే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ్నుంచి ఆయన్ను ముందుకు కదలనీయట్లేదు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అప్పటికే భారీగా ముద్రగడ అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా భారీగానే మోహరించారు. పాదయాత్రకు అనుమతి లేనందున ముద్రగడను అడ్డుకుంటున్నారు పోలీసులు. అయితే, తాము మాత్రం పాదయాత్ర చేసితీరుతామని ముద్రగడ అంటున్నారు.
ఈ నేపథ్యంలో కిర్లంపూడిని పోలీసుల తమ వలయంలో బంధించారు. అంతేగాక, ముద్రగడ ఇంటి ముందు కెమెరాలను ఏర్పాటు చేశారు. కిర్లంపూడిలో 144 సెక్షన్ విధించారు. అనుమానితులను బైండోవర్ చేస్తున్నారు. మొత్తం 6వేల మంది పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. డీఎస్పీ స్థాయి వాటిని పర్యవేక్షిస్తున్నారు.
పాదయాత్ర కోసం వస్తున్నవారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. కాగా, ఇదే తన చివరి పోరాటమని, పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ అంటున్నారు. కాపు రిజర్వేషన్ల హామీ ఇచ్చి మూడేళ్లు అయినా.. ఎలాంటి ముందడగు పడలేదని ఆయన అన్నారు. అయితే, పోలీసులు మాత్రం ముద్రగడను తిరిగి ఆయనను ఇంట్లోకి పంపించే ప్రయత్నాలు చేశారు.
దీంతో ముద్రగడ ఇంట్లోకి వెళ్లిపోయారు. ముద్రగడను 24గంటలపాటు గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాగా, కిర్లంపూడికి వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా, ప్రతీ రోజూ ఉదయం కాపులు కిర్లంపూడికి రావాలని ముద్రగడ పిలుపునిచ్చారు. తమకు పాదయాత్ర చేసుకునే స్వేచ్ఛ కూడా లేదని అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా?.. లేక పోలీస్ రాజ్యమా? అని నిలదీశారు.