'వారాహి' వచ్చింది.. అసలు కథ ఇప్పుడే!!
'వారాహి' తొలిసారిగా ఏపీలోకి ప్రవేశించింది కాబట్టి అసలు కథ ఇప్పుడే ప్రారంభమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో తన రాజకీయ పర్యటనలు, ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా వాహనం తయారుచేయించుకున్నారు. దానికి 'వారాహి' అని పేరుపెట్టి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో తొలి పూజ చేయించారు. తర్వాత ధర్మపురిలో మరో పూజ చేయించారు. 'వారాహి'తో తొలిసారిగా ఏపీలో ప్రవేశించారు.

ఇంద్రకీలాద్రిపై వాహన పూజ
విజయవాడ ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేసిన తర్వాత తన వాహనానికి వాహనపూజ చేయించుకున్నారు. అంతటితో కథ అయిపోలేదు.. అసలు కథ ఇప్పుడే ప్రారంభమవుతోంది. పవన్ కళ్యాణ్పై మంత్రులు నిప్పులు చెరుగుతుంటారు.
మిలటరీ వాహనాన్ని పోలి ఉన్న 'వారాహి'కి వేసిన రంగుపై తొలుత మాజీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అభ్యంతరం తెలియజేశారు. కానీ అది దానికి దగ్గరగా ఉండే వేరే రంగు అని తెలంగాణ రవాణాశాఖ తేల్చి చెప్పింది.

పవన్ పై వైసీపీ గురి
'వారాహి'కి తెలంగాణ ప్రభుత్వం జాతీయస్థాయి పర్మిట్ ఇచ్చింది. అయినప్పటికీ దానిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ఏపీ రవాణాశాఖ సూచనల ప్రకారం వారాహికి మార్పులు చేయాల్సి ఉంటుందని, లేదంటే రహదారులపై తిరగనీయమని హెచ్చరించారు.
వాస్తవానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైసీపీకి ప్రత్యర్థి పార్టీ. కానీ వైసీపీ నేతల ప్రధాన గురి మాత్రం పవన్ కల్యాణ్ పైనే ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీచేస్తే వైసీపీకి నష్టం జరుగుతుందనే అంచనాతో ఆ పొత్తు కుదరనివ్వకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు.

అసలు కథ ఇప్పుడే..
'వారాహి' తొలిసారిగా ఏపీలోకి ప్రవేశించింది కాబట్టి అసలు కథ ఇప్పుడే ప్రారంభమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా 'వారాహి'పై అభ్యంతరాలేమైనా ఉన్నాయా? అనేది రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పాల్సి ఉంటుంది.
'వారాహి'కి మార్పు చేర్పుల విషయంకానీ, ఆ వాహనం తిరగడానికి పలు ఆంక్షల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర.. మరోవైపు పవన్ కల్యాణ్ యాత్రలతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కనుంది.












Click it and Unblock the Notifications