కెసిఆర్ చిచ్చు: తెలంగాణ రావడం ఇష్టం లేకనా?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం జరిగిన సకల జనుల భేరీ బహిరంగ సభలో తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు చిచ్చు పెట్టారు. కెసిఆర్పై వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్కు తెలంగాణ రావడం ఇష్టం లేకపోవడం వల్లనే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యుసి ప్రకటన వెలువరించడం కెసిఆర్కు పిడుగుపాటులాంటిదని వ్యాఖ్యానించారు.
చంద్రశేఖర రావు వ్యాఖ్యలు తెలంగాణ సంస్కృతికి విరుద్ధమని కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సకల జన భేరీలో కేసీఆర్ భాష, మాటలు అభ్యంతరకరమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని అభినందించక పోవడమేమిటన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ పెద్దగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. కెసిఆర్ వ్యాఖ్యలను తమ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తెరాసకు కూడా ఇష్టం లేనట్టుగా కనబడుతోందని ఆయన ఆరోపించారు.

సీమాంధ్ర మండల కేంద్రాల్లో లక్షలాది మంది పోగవుతుంటే చూడలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. 'ఎవరన్నా ఉద్యమం చేస్తుంటే మరో ఉద్యమ నేత మాట్లాడడు.. అలాంటిది, సమైక్యాంధ్రలో జరుగుతున్నది ఉద్యమం కాదంటావా? కళ్లు పోయాయా? లేక, ప్రజల్ని రెచ్చగొడుతున్నావా?' అని సోమిరెడ్డి ప్రశ్నించారు.
తమకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతుంటే కెసిఆర్తో పాటు కేంద్రానికీ దిమ్మతిరిగిపోతోందని సోమిరెడ్డి అన్నారు. కెసిఆర్, జగన్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలకు ప్రజలను ఎందుకు బలిచేస్తారని ఆయన అడిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం గురించి కేసీఆర్ కి ఏం తెలుసంటూ ధ్వజమెత్తారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి అవాకులు చవాకులు పేల్చే
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు పార్టీ చెప్పడం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు పిడుగులాంటి వార్త అని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు. 2014 వరకు తెలంగాణ రాకుంటే వచ్చే ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుచుకుందామని ఆయన కలలు కన్నారని, అవి కల్లలు కావడంతో ఆయన రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రకటనతో కెసిఆర్ కలలు పేకమేడల్లా కుప్పకూలాయని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు కెసిఆర్, సీమాంధ్రకు వైయస్ జగన్, దేశానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు నాయకత్వం వహించలేరన్నారు. తెలంగాణపై సిడబ్ల్యూసి ప్రకటన వచ్చి అరవై రోజులైనా బిల్లు ఎందుకు పెట్టలేదని ఆయన కాంగ్రెసును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
ఎవరి ఉద్యోగాలు ఎవరూ లాక్కోలేదని, సీమాంధ్ర వ్యాపారాలను దోచుకుంది కెసిఆరేనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమార్ మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలు ఎవరినీ దోచుకోలేదని ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సకల జన భేరీ సభలో కెసిఆర్ తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెసు పార్టీకి కనీస కృతజ్ఞత కూడా చెప్పలేదని మెదక్ ఎంపి విజయశాంతి ఆదివారం విమర్శఇంచారు. తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెసును వదిలి బిజెపి నేతలను పొగడటమేమిటన్నారు. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెసు నేతలు తెరాసను కొంత పట్టించుకోనందువల్లనే బిజెపి వైపు వెళ్లే దిశగా కెసిఆర్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెసుతో అవగాహన కుదరక పోవడంతో వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసేందుకు ఆలోచిస్తున్నట్లు అతని ప్రసంగం సంకేతాలిస్తోందన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ రావడం కెసిఆర్కు ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా విరుచుకుపడ్డారు. కెసిఆర్ భాషను బూతుపురాణంగా అభివర్ణించారు. తెలంగాణ రావడం కెసిఆర్కు ఇష్టంలేనట్లుగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications