TDP Vs YCP: సోషల్ మీడియాలో గెలిచేదెవరు?
రాజకీయాలు రోజురోజుకు రంగులు మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఒక నేత ప్రచారానికి వస్తున్నారంటే ఆయన్ను చూడటానికి గంటల తరబడి, రోజుల తరబడి ఎదురు చూసిన సందర్భాలున్నాయి. తమకిష్టమైన నాయకుడి గురించి పత్రికల్లో, పుస్తకాల్లో ఏం రాశారు? అనేది తెలుసుకోవడానికి వాటన్నింటిని కొనుగోలు చేసుకొని ఇంట్లో పెట్టుకునేవారున్నారు. ప్రజల్లో పేరు తెచ్చుకున్న నాయకుడు.. లేదంటే వారి అభిమానాన్ని దోచుకున్న నాయకుడంటే ఆయన్ను గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేవారు. గుండెల్లో పెట్టుకొని అభిమానించేవారు.

అరచేతిలో ఫోన్ ఉంటే చాలు..
కాలం మారుతోంది.. రోజులు మారుతున్నాయి.. కాలానుగుణంగా మార్పు చోటుచేసుకోవడం సహజం. అయితే ఆ మార్పు మానవ జీవితాల్ని ఆనందమయం చేసేదిలా ఉండాలేకానీ జీవనశైలిని ఛిన్నాభిన్నం చేసేలా ఉండకూడదు. దినపత్రికలు, టీవీలతోపాటు తాజాగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్, లింక్డిన్.. ఇలా సామాజిక మాధ్యమాలు ప్రజల్ని శాసించే స్థితికి చేరుకున్నాయి. చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోతోంది. సమస్త వార్తా ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే. అయితే వాస్తవమైన వార్తలు ఎలా వస్తున్నాయో, కల్పితమైన వార్తలు అంతకు రెండింతలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఫేక్ వార్తలే నిజమైన వార్తలుగా చాలామంది భ్రమపడేలా వాటిని తీర్చిదిద్దుతారు.

ఏది నిజం? ఏది అబద్ధం?
జీవనశైలిలో వేగం పెరుగుతున్న కొద్దీ ఏది నిజమైన వార్త, ఏది అబద్ధపు వార్త అని తెలుసుకోవడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపడంలేదు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకొని ఫేక్ ప్రచారం చేసే సంస్థలు పుట్టుకొచ్చాయి. ''నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందన్నది'' సామెత. సరిగ్గా ఈ సామెతనే నిజం చేస్తున్నాయి నేటి సామాజిక మాధ్యమాలు.

పార్టీలకు అనుబంధ విభాగాలు సోషల్ మీడియాలు
రాజకీయ పార్టీలకు అనుబంధ విభాగాలు ఉండటం సహజం. చివరకు సోషల్ మీడియా అంటూ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. వాటిద్వారా ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేయడం, విమర్శలను ఖండించడంతోపాటు తాము చేసే పనులను సమర్థించుకుంటూ పుంఖానుపుంఖాలుగా వార్తలను పోస్ట్ చేస్తారు. ప్రతి పార్టీ ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది. దీంతో ఏది అసలు, ఏది నకిలీ వార్త అనే విషయంలో ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు.

రాజకీయాన్ని శాసిస్తోన్న సోషల్ మీడియా
రాజకీయం అంటేనే సోషల్ మీడియా వార్ గా మారిపోయింది. అబద్ధపు ప్రచారాలు, ఖండనలు.. ఒకటేమిటి.. ఏది అసలో? ఏది నకిలీయో తెలియనంతగా ఇవి ప్రజల జీవనంలో ముడిపడిపోతున్నాయి. రాజకీయం నుంచి సోషల్ మీడియాను వేరుచేసి చూడలేని స్థితి. ఒకరకంగా సోషల్ మీడియానే రాజకీయాన్ని నడిపిస్తోందనుకోవాలి. ఇందులో పైచేయిగా సాధించడానికి ఏపీలోని తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ హోరాహోరీగా పోరు సలుపుతున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలు కావడంలో వైసీపీ సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఈసారి అటువంటి పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు కూడా తమ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. చివరకు ఈ రెండు పార్టీలకు అధికారం దక్కాలన్నా.. చేజారాలన్నా సోషల్ మీడియానే ప్రధాన పాత్ర వహించబోతోంది.












Click it and Unblock the Notifications