ఏపీలో ఉచిత విద్యుత్ మీటర్ల రచ్చ-సర్కార్ డెడ్ లైన్ తో జనాగ్రహం-క్యాష్ చేసుకుంటున్న టీడీపీ
ఏపీలో మాజీ సీఎం వైఎస్ హయాంలో పురుడుపోసుకున్న రైతులకు ఉచిత విద్యుత్ పథకం ఇప్పటివరకూ నిరాటంకంగా కొనసాగింది. అయితే కేంద్రం తెచ్చిన నిబంధనల్ని రాష్ట్రంలో అమలుచేసేందుకు వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలతో దీనికి గండిపడేలా ఉంది. దీంతో రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఆరు నెలల్లోనే పూర్తిస్ధాయిలో మీటర్లు బిగించాలని వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా రచ్చకు కారణమవుతోంది.
ఉచిత విద్యుత్ మీటర్ల వివాదం
ఏపీలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు 2004లో ఇచ్చిన హామీల్లో ఒకటి రైతులకు ఉచిత విద్యుత్. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ తొలి సంతకం చేసింది కూడా ఈ ఫైలు పేనే. దీంతో రైతులకు ఉచిత విద్యుత్ అనేది రాష్ట్రంలో ప్రయారిటీగా మారిపోయింది. వైఎస్ హయాంలో నిరాటంకంగా, బేషరతుగా అమలు చేసిన ఈ పథకం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో పేరు తెచ్చింది. 2019లో కాంగ్రెస్ మరోసారి గెలిచేందుకూ పనికొచ్చింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా దీన్ని పక్కాగా అమలు చేశాయి. అయితే వైసీపీ ప్రభుత్వంలోనూ ఈ పథకం బేషరతుగా కొనసాగుతుందని భావించిన వారికి జగన్ షాకిచ్చారు. కేంద్రం విధించిన నిబంధనల సాకుతో ఉచిత విద్యుత్ కు మీటర్లు బిగించడం మొదలుపెట్టారు. దీంతో వివాదం మొదలైంది.
6 నెలల్లో 18 లక్షల కనెక్షన్లకు మీటర్లు
వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలోని 18 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తామంటూ తాజాగా విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి చేసిన ప్రకటన రైతుల్లో గుబులు రేపుతోంది. గతేడాదే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ప్రభుత్వం పెద్దగా అభ్యంతరాలు లేవనే అంచనాతో ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి చేసిన ప్రకటనతో అధికారులు కూడా ఉచిత విద్యుత్ కు ముకుతాడు వేసేందుకు బయలుదేరారు. రాష్ట్రంలో ఒక్కొక్కటిగా ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు వేయబోతున్నారు.
అన్నదాతల ఆగ్రహం-రంగంలోకి టీడీపీ
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కు మీటర్లు బిగించాలన్న వైసీపీ ప్రభుత్వ ఆదేశాల్ని తప్పుబడుతూ అన్నదాతలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న రైతులు విపక్షాల్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో సహజంగానే దీన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ రంగంలోకి దిగింది. అన్నదాతలకు ఉచిత విద్యుత్ తీసేయాలన్న దురుద్దేశంతోనే జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారిపోతోంది.
వైసీపీ సర్కార్ సమర్ధన
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కు మీటర్లు బిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ సర్కార్ మాత్రం సమర్ధించుకుంటోంది. ఇది గతంలోనే తీసుకున్న నిర్ణయమని, రాష్ట్రంలో విద్యుత్ సంస్ధల్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమంటూ పార్టీ నేత సజ్జల తాజాగా దీన్ని సమర్ధించుకున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లకు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనేది లక్ష సార్లు చెప్పామని, వ్యవసాయ మీటర్లు బిగింపు వెనుక డొంక తిరుగుడు ఏదీ లేదని కూడా సజ్జల వ్యాఖ్యానించారు.
శాశ్వతంగా రైతులకు లబ్ది, డిపార్టుమెంట్ కు అకౌంటబులిటీ కోసం మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మీటర్ల ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి ఆర్ధికంగా వెసులుబాటు వస్తుందని,మీటర్లు బిగించడంలో తప్పేముందో అర్ధం కావడం లేదన్నారు. రైతులకు ఆత్మగౌరవంతో తనకు రావాల్సింది తీసుకునే పరిస్ధితి వస్తుందన్నారు. మీటర్ల ఏర్పాటు శ్రీకాకుళంలో ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతమైందని,ఉచిత విద్యుత్ పై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని సజ్జల ఆరోపించారు. మీటర్ల ఏర్పాటుపై రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.