అన్నదమ్ముల సవాల్: చిరుతో పవన్ కళ్యాణ్ కలిసేనా?
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కొన్ని స్థానాలలోనైనా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో అన్నదమ్ముల సవాల్గా ఎన్నికలు మారనున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారు. విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో దాదాపు తుడిచి పెట్టుకుపోయింది.
దీంతో, ఇమేజ్ కలిగిన చిరంజీవికి పార్టీని పునర్ నిర్మించే బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెసు పార్టీని సీమాంధ్రలో ఆయననే గట్టెక్కించవలసి ఉంది! ఆయన తమ్ముడు పవన్.. జనసేనతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇద్దరు పూర్తి విరుద్ధంగా వెళ్తున్నారు. చిరంజీవి కాంగ్రెసు పార్టీని గెలిపించాలని కోరుతూ ప్రజల ముందుకు వెళ్తున్నారు. పవన్.. కాంగ్రెసును ఓడించాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

ముఖ్యంగా పవన్ కాంగ్రెసు పార్టీని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా ప్రయత్నిస్తానని పవన్ చెప్పారు. కాంగ్రెసును ఓడించేందుకు మిగతా ఏ పార్టీతోనైనా తాను కలిసేందుకు సిద్ధమని పవన్ ప్రకటించారు. దీంతో, సీమాంధ్రలో అన్నదమ్ముల సవాల్గా ఎన్నికలు మారనున్నాయి. పవన్ కనుక బిజెపి లేదా తెలుగుదేశం పార్టీతో కలిస్తే అది మరింత ఉత్కంఠగా మారనుంది.
చిరుతో పవన్ కలిసేనా?
ప్రస్తుత పరిస్థితిని బట్టి సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అయితే పవన్, కిరణ్ పార్టీలు పుట్టుకు రావడం వంటి పరిణామాలతో కాంగ్రెసు పార్టీ ఎక్కువ సీట్లను సాధిస్తే... చిరును ముఖ్యమంత్రిగా చేసేందుకు పవన్ సాయం అందిస్తారా? అనే చర్చ కూడా అప్పుడే సాగుతోంది. ఒంటినిండా కాంగ్రెసు వ్యతిరేకతను కూడగట్టుకున్న పవన్... ఎట్టి పరిస్థితుల్లోను సహకరించే అవకాశం లేదని చెబుతున్నారు.
అయితే, చిరు సిఎం అయ్యే అవకాశముంటే అన్నయ్య కోసమని చెప్పి సహకరించే అంశాన్ని కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ కోసం చేసిన ప్రచారంలో పవన్ కాంగ్రెసు నేతలపై నిప్పులు చెరిగారని, ఆ తర్వాత పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసినందువల్లే ఆయన జనసేనతో ముందుకు వచ్చారని, ఇప్పుడు కూడా ఆయన టార్గెట్ కాంగ్రెస్ పార్టీయేనని, అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను తగ్గేది ఉండదని అంటున్నారు.












Click it and Unblock the Notifications