పొత్తుకు యత్నించలేదు, కెసిఆరే అన్నారు: పొన్నాల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన తాము చేయలేదని, పొత్తు కోసం ప్రయత్నాలు కూడా చేయలేదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావే అన్నారని ఆయన గుర్తు చేశారు.
తెరాస నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని తాము చెప్పామని, ప్రతిపాదనలు వస్తాయో లేదో వారే చెప్పాలని ఆయన అన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టారని కెసిఆర్ ఆరోపిస్తున్నారని, ఇప్పుడు కెసిఆర్కు కేసులు గుర్తుకు వచ్చాయా అని పొన్నాల అన్నారు. విలీనం చేస్తామని చెప్పి తెరాస మాట తప్పిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో పొత్తుల కోసం కమిటీ వేసింది కూడా తెరాసనే అని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ బలంగా ఉందని ఆయన అన్నారు.

పదవి కోసమే దివాకర్ రావు తెరాసలో చేరారని కాంగ్రెసులో చేరిన తెరాస మాజీ నేత అరవింద్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చారనే తాను కాంగ్రెసులో చేరినట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ హిట్లర్ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్సించారు.
తెరాస శాసనసభ్యులంతా కెసిఆర్ వద్ద పాలేరులేనని, తాము తెరాసలో కెసిఆర్ పాలేరులా బతికామని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెరాస మధ్య పొత్తు ఉంటేనే ఉభయులకూ లాభమని ఆయన అన్నారు. తనతో పాటు కాంగ్రెసులోకి వస్తామని హామీ ఇచ్చిన తెరాస శాసనసభ్యులు మాట మీద నిలబడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications