'4సార్లు రూటుమార్చిన కేసీఆర్, అంటరాని వ్యక్తి', మోడీపై పురంధేశ్వరి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయంలో తన చాంబరుకు వెళ్లేందుకు కేసీఆర్ నాలుగుసార్లు రూటు మార్చారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.
కేసీఆర్ను భయంకరమైన అభద్రతాభావం వెంటాడుతోందన్నారు. తప్పులు ఎత్తిచూపుతున్న తన వల్ల, ప్రతిపక్షాల వల్లే కేసీఆర్కు అభధ్రతాభావం ఉందన్నారు. కేసీఆర్ది అహంకారపు పాలన అన్నారు. వాస్తుదోశం, వ్యక్తిగత మొక్కులకు ప్రజాధనం ఖర్చ చేయడం సరికాదన్నారు.
మూఢనమ్మకాల ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారన్నారు. కేసీఆర్ నిర్ణయాలను, విధానాలను కోర్టులే తప్పుపడుతున్నాయన్నారు. ఛాతి ఆసుపత్రి తరలింపు పైన కోర్టుకు వెళతామని ప్రభుత్వాన్ని పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు.
దుయ్యబట్టిన మోత్కుపల్లి
తెరాస గెలిస్తే దళిత ముఖ్యమంత్రి అన్న మాటను కేసీఆర్ తప్పారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రాజకీయంలో అంటరానితనాన్ని కలిగి ఉన్న ఏకైన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ కేబినెట్.. ఫ్యామిలీ కేబినెట్ అన్నారు. కేసీఆర్ దళిత ద్రోహి అని, ఆయన క్షమాపణ చెప్పాలన్నారు.
కేసీఆర్ తెలంగాణలో రుణమాఫీ చేసినట్లు మాట్లాడుతున్నారని, రుణాలు మాఫీ అయ్యాయో లేదో కేసీఆర్కు ధైర్యముంటే సర్వే నిర్వహించాలన్నారు.
కాగా, కేసీఆర్ కేబినెట్లో దళితులను చేర్చుకోమని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదేశించాలని తెలంగాణ టీడీపీ నాయకులు గవర్నర్ను కోరారు. దళితుడైన రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి బీసీ అయిన కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి చోటు కల్పించారని వారు ఫిర్యాదు చేశారు.
మోడీ సమర్థులు: పురంధేశ్వరి
బీజేపీతోనే సుస్థిర పాలన సాధ్యమని, అందుకు ప్రధాని నరేంద్ర మోడీ సమర్థులని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వేరుగా అన్నారు. ప్రకాశం జిల్లా కొనకనమెట్లలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అధిక సంఖ్యలో యువకులు సభ్యులుగా నమోదు చేసుకోవాలన్నారు.