గజ్వెల్లో కెసిఆర్ గెలవడు, చంద్రబాబు శిష్యుడు: పొన్నాల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలవడని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శనివారం సాయంత్రం జోస్యం చెప్పారు. తనను గిచ్చితే రెచ్చిపోతానని మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న కెసిఆర్ అంచనాలు తప్పన్నారు. జగన్కు అధికార ప్రతినిధి అన్నట్టు కెసిఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. కెసిఆర్లా మాట్లాడడానికి తనకు చదువు, సంస్కారం అడ్డొస్తున్నాయన్నారు.
కెసిసీఆర్ నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని, ఆయన ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. తెరాస సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, క్యాంపులూ గీంపులూ ఉండవన్న కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ నేతలను ఢిల్లీకి తీసుకెళ్తానని కెసిఆర్ అన్నారని, దీన్ని క్యాంపులు అని గాక మరేమంటారని ప్రశ్నించారు.

తన పని తీరు చూసి ఆయన ఓర్వలేకపోతున్నారన్నారు. వాస్తవాలు చెబుతున్నందుకు తనపై నిరంకుశంగా అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. కెసిఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే విభజన విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పు ఏమిటో బయటపెట్టాలన్నారు.
పిల్లిమొగ్గలు వేసే కెసిఆర్ నన్ను బ్రోకర్ అంటాడా? ఆకలి, అవగాహన నన్ను అమెరికా వరకు తీసుకు వెళ్లాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చానని, దీనికి భిన్నంగా కెసిఆర్ యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు అక్రమ రవాణాకు పాల్పడ్డారన్నారు.
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు శిష్యరికం చేశారని, తనను గిచ్చితే రెచ్చిపోతానని హెచ్చరించారు. రంగులు మార్చే కెసిఆర్ ముందుగా ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు. ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే అది పార్టీ విజయమని, ఓడితే వ్యక్తిగతంగా తాను బాధ్యత వహిస్తానని పొన్నాల వెల్లడించారు.












Click it and Unblock the Notifications