పోస్టల్ బ్యాలెట్: అసాధారణంగా దూసుకెళ్లిన వైఎస్ఆర్ సీపీ
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ముందుగా- పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు మొదలు పెట్టారు. పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యతను ప్రదర్శించింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లలో భారీ ఆధిక్యతను సాధించింది వైఎస్ఆర్ సీపీ.
ముందుగా ఊహించినట్టే కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ దూసుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావిస్తోన్న అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ సీపీ ఆధిక్యతను ప్రదర్శిస్తుండటం గమనార్హం. ప్రారంభంలో అందిన సమాచారం ప్రకారం, ఓట్ల సరళిని బట్టి చూస్తోంటే- ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయని వైఎస్ఆర్ సీపీ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.