వైసీపీకి పట్టున్న ఊర్లో పవన్ కళ్యాణ్కు బ్రహ్మరథం
విజయవాడ: గుంటూరు జిల్లా బేతపూడి గ్రామంలో జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటించారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఊరి రైతులంతా భూసేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
గతంలో చాలా భూమిని ప్రభుత్వానికి ఇచ్చామని, ఇప్పటి వరకు దానికే పరిహారం అందలేదని... ఒక్క ఎకరం కూడా ప్రభుత్వానికి ఇవ్వమని ఖరాకండిగా చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే, ఈ గ్రామంలో అధిక శాతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులే ఎక్కువ.
అయితే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత పట్టున్న ఈ గ్రామం రైతులు ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బ్రహ్మరథం పట్టారు. సభా వేదికపై రైతులతో పాటు పవన్ కూడా కిందనే కూర్చోని ప్రసంగం చేయడం విశేషం.
ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి బాధలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రైతులు సంతోషంగా రాజధానికి భూములు ఇస్తే తాము వ్యతిరేకం కాదన్నారు. బలవంతంగా భూములు తీసుకుంటే రైతుల తరపున ఆందోళనకు సిద్దమని ప్రకటించారు.
అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని ప్రకటించారు. గ్రామాలను నగరాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. బలవంతంగా భాసేకరణ చేస్తే రైతుల తరుపున పోరాటం చేస్తానని చెప్పారు. బేతపూడి గ్రామంలో ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో పవన్ కళ్యాణ్కు చెమటలు పట్టాయి.
దీంతో, పక్కనే ఉన్న ఓ రైతు పవన్కు టవల్ ఇచ్చారు. ఆ టవల్తో పవన్ కళ్యాణ్ తన ముఖాన్ని తుడుచుకున్నారు. మరో మహిళ తాను తెచ్చుకున్న బాక్స్ నుంచి కొంత ఫలహారాన్ని పవన్కు తినిపించింది. మరో పెద్ద వయసున్న మహిళ పవన్ కళ్యాణ్ను ఆప్యాయంగా ముద్దాడింది.