పోలవరం ప్రాజెక్టుకు పిపిఎ పేచీలు: గుర్రుమంటున్న ఎపి ప్రభుత్వం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పేచీ పెడుతోంది. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంపై కుదుర్చుకోవాల్సిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) విషయంలో తిరకాసు పెట్టినట్లు ఓ ప్రముఖ దినపత్రికలో శనివారం వార్తాకథనం వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ జల వనరుల శాఖ అధికారులు ఎంవోయూను తిప్పి పంపించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం కేంద్రమే నిధులు విడుదల చేసి, ప్రాజెక్టును నిర్దిష్ట కాలంలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేయాలి. దీని ప్రకారమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పడింది.
ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం - ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాల్సిన పీపీఏనే ఇప్పుడు అవగాహన ఒప్పందంపై మెలికలు పెడుతోంది. జాతీయ హోదా ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందం ప్రతిపాదనలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో నిధుల విడుదల, వాటి ఖర్చు, పనుల పూర్తికి సంబంధించిన ప్రధాన బాధ్యత ప్రాజెక్టు అథారిటీకే ఉంటుంది. ఈ ఒప్పందానికి నిర్దిష్ట ప్రొఫార్మా కూడా ఉంటుంది.
మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదాను ప్రకటించినప్పుడు.. ఆ విధంగానే ఒప్పందాలు జరిగాయి. దీనివల్ల ఆయా ప్రాజెక్టులు సజావుగా పూర్తయ్యేందుకు తగిన వాతావరణం నెలకొంది. అయితే, పోలవరంపై రూపొందించిన ఒప్పంద పత్రం మాత్రం పీపీఏ సొంతంగా, ప్రత్యేకంగా రూపొందించుకున్నట్లుగా ఉంది.
అధికారాలు, పర్యవేక్షణను తాము తీసుకుంటూ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది బాధ్యత అనే విధంగా నిబంధనలున్నాయి. జాతీయ ప్రాజెక్టు హోదాకు సంబంధించిన ప్రొఫార్మాలో ఒప్పందాలను రూపొందిస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని, పర్యవేక్షణ, నిధుల చెల్లింపు వ్యవహారాలన్నీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ చూసుకుంటుందని అంటున్నారు.
అంచనాల మేరకు విడతల వారీగా నిధులు ముందస్తుగా మంజురవుతాయని చెప్పారు. కానీ, పీపీఏ పంపిన ఒప్పందంపై సంతకం చేస్తే నిధులు సకాలంలో అందక చాలా నష్టపోవాల్సి వస్తుందని ఏపీ చెబుతోంది. పిపిఎ పంపిన ఒప్పంద పత్రంపై సంతకాలు చేయడానికి ఎపి నిరాకరించింది. జాతీయ ప్రాజెక్టుల ఫ్రొఫార్మాలో అవగాహన ఒప్పందం తయారు చేస్తేనే సంతకాలు చేస్తామని ఏపీ స్పష్టం చేసింది. పీపీఏ పంపిన ఒప్పంద పత్రాన్ని తిప్పి పంపింది.