మోడీపై ప్రశంసలు-కాంగ్రెస్ పై విమర్శలు-సాయిరెడ్డి ట్వీట్ వార్-ఆ భయాలే కారణమా ?
ఏపీలో కాంగ్రెస్ పనైపోయింది.. బీజేపీకి దూరే అవకాశం లేదు.. కానీ వీరిద్దరిపై జాతీయస్ధాయిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఇంగ్లీష్ ట్వీట్లు దంచేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు నిత్యం అదే పనిలో ఉంటున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా కాంగ్రెస్ ను, గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం, మోడీ సర్కార్ ను, బీజేపీని పొగిడేయడాన్ని సాయిరెడ్డి ఆనవాయితీగా మార్చేసుకున్నట్లే కనిపిస్తోంది. దీంతో సాయిరెడ్డి ఏ ప్రయోజనాల్ని ఆశించి ఈ ట్వీట్లు పెడుతున్నారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
విజయసాయిరెడ్డి ట్వీట్ల రచ్చ
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాల రాజకీయంలో నిత్యం ట్వీట్లతో హంగామా చేస్తున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రమే. సాయిరెడ్డి పెడుతున్నన్ని ట్వీట్లు ఇప్పుడు ఏపీలో ఏ రాజకీయ పార్టీ అధినేత కానీ, కీలక నేతలు కానీ పెట్టడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి పెట్టే ట్వీట్లు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. అంతే కాదు తమ పార్టీతో విభేధిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సైతం విమర్శిస్తూ సాయిరెడ్డి ట్వీట్లు పెడుతుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా జాతీయ స్ధాయిలో, అంతర్జాతీయ స్ధాయిలో జరిగే పరిణామాలపైనా సాయిరెడ్డి ట్వీట్లతో రచ్చ చేస్తున్నారు.
కాంగ్రెస్ టార్గెట్ గా ట్వీట్ వార్
జాతీయ స్దాయిలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు ఉనికి చాటుకునేందుకు అపసోపాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీపై, యువనేత రాహుల్, పార్టీ అధినేత్రి సోనియాగాంధీని టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్లు పెడుతున్నారు. జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి అయిన బీజేపీ నేతలు అయినా సందర్భానుసారం ట్వీట్లు పెడుతున్నారేమో కానీ విజయసాయిరెడ్డి మాత్రం అదే పనిగా కాంగ్రెస్ ను ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఆ పార్టీ వ్యవస్ధాగత ఎన్నికల్ని, రాహుల్ భారత్ జోడో యాత్రను సైతం టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి రెచ్చిపోతున్నారు. దీంతో సాయిరెడ్డికి ఒకప్పుడు తమను జైలుకు పంపిన కాంగ్రెస్ పై కోపం ఇంకా తగ్గలేదా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ ను కొత్తగా తిట్టుకోవాల్సినంత అవసరం సాయిరెడ్డికి ఎందుకొచ్చిందన్న చర్చ కూడా సాగుతోంది.
బీజేపీపై పొగడ్తలతో ట్వీట్లు
అదే సమయంలో బీజేపీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ చిన్న అభివృద్ది కార్యక్రమం చేపట్టినా సాయిరెడ్డి వాటిని పొగుడుతూ ట్వీట్లు పెట్టేస్తున్నారు. ఎక్కడో బీజేపీ పాలిత గుజరాత్ లో కట్టిన సబర్మతీ వంతెన నుంచి మొదలుపెట్టి.. కేంద్రంలో మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ సమర్దిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ప్రధాని మోడీ చేపట్టే కార్యక్రమాలన్నింటిపైనా విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తుంటే బీజేపీ నేతల్ని ఆయన మించిపోతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ నేతలైనా తమ అధినేతను, పార్టీని సందర్భానుసారం పొగుడుతూ కాంగ్రెస్ ను విమర్శిస్తుంటే.. సాయిరెడ్డి మాత్రం సుప్రీంకోర్టు ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఇచ్చిన ఆదేశాల్ని సైతం కాంగ్రెస్ కు లింక్ చేస్తూ విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వార్ చర్చనీయాంశంగా మారింది.
సాయిరెడ్డి ట్వీట్ల వెనుక ఆ భయాలు ?
జాతీయ స్ధాయిలో బీజేపీ, కాంగ్రెస్ ల తాజా పరిస్ధితి రాజకీయాల్లో కనీస పరిజ్ఢానం ఉన్న నాయకుల్ని ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం కొత్తగా బీజేపీలో చేరిన నేత తరహాలో పెడుతున్న ట్వీట్లు చూస్తుంటే దీని వెనుక అసలు కారణాలు వేరే ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా చంద్రబాబుకు, టీడీపీకి బీజేపీ, మోడీ ఇస్తున్న ప్రాధాన్యం, కాంగ్రెస్ పార్టీపై జాతీయస్ధాయిలో మరింత వ్యతిరేకత పెంచడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ అడక్కుండానే బీజేపీకి పలుమార్లు వైసీపీ అండగా నిలిచినా.. కాషాయ పార్టీ, ప్రధాని మోడీ మాత్రం తమను పట్టించుకోవడం లేదనే ఆవేదన సాయిరెడ్డి ట్వీట్లలో కనిపిస్తోంది. మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్రను బీజేపీ నేతలే పట్టించుకోని పరిస్ధితుల్లో తన ట్వీట్లతో బీజేపీ పెద్దల దృష్టిలో పడేందుకు సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అదీ ఇంగ్లీష్ లోనే ఈ ట్వీట్లు పెట్టడం ద్వారా జాతీయ స్ధాయిలో వాటిపై చర్చ జరగాలని సాయిరెడ్డి కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ సాయిరెడ్డి ట్వీట్లకు అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ నేతలు కానీ స్పందించడం లేదు.