ఏపీలో చెట్టు నాటిన జవదేకర్, ఢిల్లీ నుండి సూపర్వైజ్ చేస్తారని బాబు
గుంటూరు: నీరు-చెట్టులో భాగంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ చెట్టు, తాను ఓ చెట్టును నాటామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం చెప్పారు. తాను నాటిన చెట్టు బతికే ఉందా లేదా అని జవదేకర్ ఢిల్లీ నుంచి సూపర్ వైజ్ చేస్తారన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వనమహోత్సవంలో చంద్రబాబు, జవదేకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కృష్ణా జిల్లా ఎందరో రాజకీయ నేతలను తీసుకు వచ్చిందన్నారు. ఎన్టీఆర్ వంటి ప్రపంచస్థాయి నేతలకు జన్మనిచ్చిన జిల్లా కృష్ణా జిల్లా అన్నారు. మనం ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఉన్నామన్నారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
చెట్లు ఎంత నాటితే అంత మంచిదన్నారు. హైదరాబాదును కట్టింది టిడిపియే తప్ప కాంగ్రెస్ పార్టీయో మరొకరో కాదన్నారు. ప్రతి ఒక్కరు చెట్లు నాటాలన్నారు. దారిద్రం లేకుండా చూసుకుందామన్నారు. ప్రతి విద్యార్థి 5 నుంచి పది చెట్లు నాటాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరు చెట్లు నాటితే రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేయవచ్చునని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో చెట్లు నాటాలన్నారు. విద్యార్థులు పెద్దయ్యాక ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లవలసిన అవసరం ఉండదని, ఇక్కడే (ఏపి) వస్తాయని చెప్పారు.
అంతకుముందు జవదేకర్ కొల్లేరును సందర్శించారు. కొల్లేరు పక్షులనే కాదు, ప్రజలనూ కాపాడాల్సిన అవసరం ఉందని జవదేకర్ చెప్పారు. కొల్లేరు ప్రాంతంలో వెంకయ్య నాయుడు, జవదేకర్ పర్యటించారు. చట్టాల సవరణ చేసైనా ప్రజలు న్యాయం చేస్తామన్నారు. త్వరలో సర్కారీ కాలువపై వంతెన నిర్మాణం ఉంటుందని తెలిపారు.