ప్రణబ్కు అన్నీ తెలుసు, చెప్పను: విభజనపై డిఎస్
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అన్ని విషయాలూ తెలుసునని, ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని తెలంగాణకు చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రపతితో కలిసిన తర్వాత ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను రాష్ట్రపతితో ఏం చెప్పాను, రాష్ట్రపతి తనతో ఏమన్నారనే విషయం మీడియాకు చెప్పబోనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవద్దని, ఏమైనా ఉంటే ప్రధానికి, రాష్ట్రపతికి చెప్పుకోవాలని ఆయన సీమాంధ్ర నాయకులను కోరారు.
ప్రస్తుత స్థితిలో అనుభవం కలిగిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండడం అదృష్టమని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలను ఎవరైనా గౌరవించాల్సిందేనని, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు 1956 నుంచే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేయడం సరి కాదని ఆయన అన్నారు.
హైదరాబాదులో రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఉండవచ్చునని, అది ఆ రకంగా అందరిదని, అయితే అది తెలంగాణకు రాజధాని అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల హక్కును సీమాంధ్ర నాయకులు గౌరవించాలని, తమతో కలిసి ఉండాలని తెలంగాణ ప్రజలపై ఒత్తిడి తేవడం సరైంది కాదని ఆయన అన్నారు. తమ హక్కును హరించడానికి ప్రయత్నించవద్దని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చకు రాష్ట్రపతి 40 రోజులు గడువు ఇచ్చారని ఆయన చెప్పారు.
అయినా తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో నాలుగు రోజులు కూడా చర్చించలేదని, జనవరి 3వ తేదీ నుంచైనా చర్చిస్తే ప్రపంచానికి ఏది న్యాయమో తెలుస్తుందని, ఏమైనా కావాలంటే సీమాంధ్ర నాయకులు అడగాలని ఆయన అన్నారు. శాసనసభలో చర్చ చేయకుండా సీమాంధ్ర నాయకులు దొడ్డి దారులు వెతుకుతున్నారని డిఎస్ విమర్శించారు. జ్ఝానవంతులైన రాష్ట్రపతి ఉన్నారని, న్యాయం తప్పకుండా జరుగుతుందనే విశ్వాసంతో శాసనసభలో బిల్లుపై చర్చించాలని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభ్యులు చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని, తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు.
లగడపాటికి అధిష్టానం బెదరదు
కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుది నకిలీ తెలుగుదేశం పార్టీ అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సమన్యాయమంటే ఏమిటో శాసనసభలో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టిందే చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యనించారు. కాంగ్రెసును విమర్సిస్తే అధికారంలోకి వస్తామని చంద్రబాబు భ్రమపడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బెదిరిపులకు అధిష్టానం బెదిరిపోదని ఆయన అన్నారు.