జగన్ కోడికత్తి పార్ట్-2: మమతా బెనర్జీపై అటాక్: ప్రశాంత్ కిషోర్ పక్కా స్కెచ్: ఏపీ బీజేపీ
అమరావతి: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చోటు చేసుకున్న దాడి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. ప్రత్యేకించి- పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదరవుతోంది. ఈ దాడి ఘటనను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా పరిగణిస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. మమతా బెనర్జీపై దాడి చోటు చేసుకున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీని నుంచి గట్టెక్కడానికి బీజేపీ పావులు కదుపుతోంది.
పక్కా ప్లానింగ్ ప్రకారమే..
పక్కా ప్లానింగ్ ప్రకారమే మమతా బెనర్జీపై చోటు చేసుకుందంటూ బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. బీజేపీ ఏపీ రాష్ట్రశాఖ నాయకులు కూడా దీన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. మమతా బెనర్జీ ఘటనను ఇదివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న కోడికత్తి దాడితో పోల్చుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో సానుభూతిని పొందడానికే ఇలాంటి కృత్రిమ దాడులు చేయించుకున్నారని ఆరోపిస్తోన్నారు. బీజేపీ రాష్ట్రశాఖ నాయకుడు లంకా దినకర్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

ప్రశాంత్ కిషోర్ స్కెచ్..
తాజాగా నందిగ్రామ్లో మమతా బెనర్జీపై చోటు చేసుకున్న దాడిని, 2018లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన కోడికత్తి అటాక్తో పోల్చారు లంకా దినకర్. ఈ రెండు దాడుల వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రమేయం ఉందంటూ పరోక్షంగా ఆరోపించారు. మమతా బెనర్జీపై దాడిని ఆయన జగన్ కోడికత్తి పార్ట్-2గా అభివర్ణించారు. ఈ రెండు ఉదంతాలు కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనల మేరకే చోటు చేసుకున్నాయనే అర్థాన్ని వచ్చేలా ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో తమపై దాడులు చేయించుకోవడం వల్ల, ఆ నెపాన్ని ప్రత్యర్థులపై నెట్టొచ్చని, దాని ద్వారా రాజకీయంగా లబ్ది పొందొచ్చని భావిస్తున్నట్లు లంకా దినకర్ పేర్కొన్నారు.

సస్పెన్షన్ ఎత్తేసిన తరువాత యాక్టివ్గా..
ఇదివరకు సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన లంకా దినకర్.. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నారనే కారణంతో కొంతకాలం పాటు ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. కొద్దిరోజుల కిందటే బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఆయనపై సస్పెన్షన్ను ఎత్తేశారు. అప్పటి నుంచి క్రియాశీలకంగా ఉంటోన్నారు. తాజాగా ఆయన ఈ ట్వీట్ వివాదాన్ని రేపుతోంది.

ఆసుపత్రిలో చేరిన మమతా..
నందిగ్రామ్లో టీఎంసీ అభ్యర్థినిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన మమతా బెనర్జీ సాయంత్రం ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం కారు ఎక్కుతున్న సమయంలో తోపులాట చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో పార్టీ నాయకులు తోసుకుని రావడంతో ఆమె అదుపు తప్పి, కిందపడ్దారు. కాలికి గాయమైంది. ఆమె నొప్పితో విలవిలల్లాడారు. నందిగ్రామ్ పర్యటనను అర్ధాతరంగా ముగించుకుని కోల్కతకు బయలుదేరారు. కోల్కత ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేరారు. ఆమె కాలికి డాక్టర్లు సిమెంట్ కట్టు కట్టారు. ప్రస్తుతం ఆమె కదల్లేని స్థిలో ఉన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వందలాది మంది తృణమూల్ కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications