వైసిపి, కాంగ్రెస్లకే అవినీతిపై పేటెంట్: ట్యాంపింగ్పై మాటలెందుకన్న ప్రత్తిపాటి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే అవినీతిపై పేటెంట్ హక్కు ఉందని ఏపి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. తమ పార్టీపై విమర్శలు చేయడం మాని, వారి సంగతి చూసుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు.
ఆయన సోమవారం మాట్లాడుతూ.. విజయనగరంలో షర్మిల చేసిన వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ గుర్తు చేసుకోవాలని ప్రత్తిపాటి హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ కేసులపై ప్రతి రోజూ మాట్లాడాల్సిన పనిలేదని, దర్యాప్తు జరుగుతోందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
20బోట్లు ఒడ్డుకు చేరాయి
సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల బొట్లలో ఇప్పటి వరకు 20 బోట్లు ఒడ్డుకు చేరాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మిగిలిన బోట్లు త్వరలోనే ఒడ్డుకు చేరుకుంటాయని తెలిపారు. బోట్ల ఆచూకీ కోసం నేవీ సహకారం కూడా తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
నౌకాదళ ఓడలు, హెలికాపర్ల సహకారంతో మిస్సింగ్ అయిన 15 బోట్లలోని 90 మంది మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వంలోని అందరూ కలిసికట్టుగా పనిచేసున్నారని మంత్రి ప్రత్తిపాటి వివరించారు. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాల వల్ల ఇద్దరు మృతి చెందినట్లు మంత్రి వెల్లడించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
రైతుల రుణమాఫీ ఫిర్యాదుల సెల్ నిలిపివేశామని, దాదాపు 6లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాటిలో నకలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. రుణమాఫీకి సుమారు మరో 3 లక్షల వరకు అర్హత వచ్చే అవకాశం ఉందని ప్రత్తిపాటి తెలిపారు.
వేరుశనగ విత్తనాలు పక్క రాష్ట్రంలో కొందామన్నా.. ఎవరూ ముందుకు రాలేదని ఆయన చెప్పారు. నిరుడు పంట దిగుమతి లేకపోవడం వల్ల ఈసారి విత్తనాల డిమాండ్ పెరిగిందని తెలిపారు. రైతులు బయటకొన్నా.. సబ్సిడీ ఇస్తామని చెప్పారు.