షాకింగ్ కామెంట్స్: ఫిరాయింపులపై నోరుజారిన పత్తిపాటి!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు పార్టీ ఫిరాయింపులపై అనుకోకుండా నోరుజారారు. తెలంగాణ, ఏపీల్లో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై నోరు జారి.. వెంటనే సర్దుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగే తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో టిడిపి నాయకులు గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గానీ తమ స్వంత ప్రయోజనాలకు, ఇతర ప్రలోభాలకు లొంగే పార్టీ మారుతున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు.
మంత్రి పుల్లారావు వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తేరుకున్న మంత్రి.. మాట మార్చారు. తమ నేత, సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిని, తాము అవలంభిస్తున్న విధానాలను చూసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ నేతలు.. ఫిరాయింపులపై ఎవరికి ఫిర్యాదు చేసినా లాభం లేదని తేల్చేశారు. మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యల్లో అర్థమేమిటని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.