ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే..?
దేశంలో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. తెలంగాణలో మునుగోడు నియోజకవర్గంతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మరో ఆరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం ఏడింటిలో ఐదు స్థానాలు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న పార్టీలవైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారనేది స్పష్టమవుతోంది.
ఉప ఎన్నికల ఫలితాలు ఏపీకి ఏం చెబుతున్నాయి?
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలవైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టం కావడంతో ఏపీలో పరిస్థితి ఏమిటి? అనే విషయంపై రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఏ ఉప ఎన్నిక జరిగినా వైసీపీనే విజయ పతాకాన్ని ఎగరవేస్తోంది. మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైనా తెలుగుదేశం, జనసేన తాము బలోపేతమయ్యామని, వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని చెబుతున్నాయి.
వేసవిలో లేదంటే.. డిసెంబరులో..
ఏపీలో ప్రజలు వైసీపీవైపే మొగ్గుచూపుతారా? అనే చర్చ ప్రారంభమైంది. కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇటీవలే ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలోకానీ, లేదంటే డిసెంబరులో కానీ ఎన్నికలు రాబోతున్నాయని, అందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.
అధికార పార్టీకే మేలు?
అయితే ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలను గమనిస్తే ఇప్పటికప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే అధికార పార్టీకే మేలు జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు తమ వ్యూహం మార్చుకోవాల్సిన అవసరాన్ని ఇవి సూచిస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రతిపక్షాలు తమ బలాన్ని, అధికార పార్టీ బలాన్ని అంచనా వేసుకొని ఎన్నికలకు సమాయత్తమవడం మంచిదనే సూచనలు వస్తున్నాయి. వీటిని విపక్షాలు ఎంతవరకు పాటిస్తాయో చూడాల్సి ఉంది!!.