ycp కంచుకోటను ఆ కుర్రాడు బద్ధలు కొడతాడా?
రానున్న ఎన్నికలకు సంబంధించి అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఇప్పటికే తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేశాయి. రెండు పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. రెండు పార్టీలకు రెండో ఆప్షన్ లేదు. ఇటువంటి తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నాలను ప్రారంభించింది.

రాయలసీమ రాజకీయాలకు ముఖద్వారం
కర్నూలు నగర నియోజకవర్గమంటేనే రాజకీయంగా చైతన్యం ఎక్కువ. రాయలసీమ రాజకీయాలకు ఇది ముఖద్వారం లాంటిది. ఇక్కడ సమయాన్నిబట్టి, పార్టీని బట్టి ఒక్కోసారి, ఒక్కోరీతిగా ప్రజలు ఆదరిస్తారు. ఏ మాత్రం ఆదమరుపుగా ఉంటే ఓటమి తప్పదు. నియోజకవర్గం ఏర్పాటైనప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగింది. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత సత్తా చాటింది. తిరిగి మళ్లీ కాంగ్రెస్ చేతుల్లోకి ఈ నియోజకవర్గం చేరింది. 1994లో కమ్యూనిస్టులు విజయకేతనం ఎగరవేశారు. 1999లో తెలుగుదేశం పార్టీ , 2004లో సీపీఎం సత్తా చాటాయి.

సందిగ్ధంలో వైఎస్ జగన్
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగా, తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోను వైసీపీ గెలుపొందింది. అయితే 2014లో 3479 ఓట్ల మెజారిటీకాగా, 2019లో 5353 మాత్రమే మెజారిటీ సాధించగలిగింది. అందుకే ఈ జిల్లాలో ఎటువంటి అలసత్వం తగదంటూ పార్టీ శ్రేణులను ముఖ్యమంత్రి జగన్ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తోపాటు ఎస్వీ మోహన్ రెడ్డి సైతం ఈసారి ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలనే విషయంలో జగన్ సందిగ్ధంలో పడ్డారు.

టీజీ భరత్ గెలుపొందేనా?
వైసీపీలో ఉన్న పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీకి వరంగా మారాయి. మొన్నటివరకు యాక్టివ్ గా లేని టీజీ భరత్ ఇప్పుడు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. తండ్రి టీజీ వెంకటేష్ బీజేపీలో ఉన్నప్పటికీ తాను మాత్రం టీడీపీలో కొనసాగుతూ రానున్న ఎన్నికల్లో జయకేతనం ఎగరవేయాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీ పరంగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ బలోపేతం చేస్తున్నారు. ఊహించినదానికంటే భరత్ ఎక్కువగా కష్టపడుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఆశలు మొలకెత్తాయి. ఇదే పనితీరును భరత్ ఎన్నికల వరకు కొనసాగిస్తే గెలుపు తథ్యమనే భావనలో పార్టీ శ్రేణులున్నాయి.












Click it and Unblock the Notifications