కేబినెట్ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం: అసెంబ్లీ రద్దు
శాసన సభను రద్దు చేసి రాష్టప్రతి పాలన కొనసాగించాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ గత శుక్రవారం చేసిన సిఫార్సును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినట్టు కేంద్ర హోంశాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల అనంతరం జూన్ 2న తెలంగాణ, సీమాంధ్రలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ రాష్ట్రంలో రాష్టప్రతి పాలన కొనసాగుతుంది.
రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న రాష్టప్రతి పాలన ఇకమీదటా కొనసాగాలంటే దాన్ని రెండునెలల్లో పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. అయితే లోక్సభ ఎన్నికల మూలంగా ఇది సాధ్యం కాలేదు. దాంతో రాష్ట్రంలో రాష్టప్రతి పాలన కొనసాగించేందుకు శాసన సభను రద్దు చేయటం మినహా యూపిఏ సంకీర్ణ ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. అందుకే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గత శుక్రవారం జరిపిన కేంద్ర కేబినెట్ సమావేశంలో శాసన సభను రద్దు చేసి రాష్టప్రతి పాలన కొనసాగించాల్సిందిగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి సిఫారసు చేసింది.
యూపిఏ సంకీర్ణ ప్రభుత్వం చేసిన సిఫార్సును ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తరువాత ఆమోదించారు. శాసన సభను రద్దు చేయటంతోపాటు జూన్ వరకు రాష్ట్రంలో రాష్టప్రతి పాలన కొనసాగించేందుకు సంబంధించిన కమ్యూనికేను జారీ చేస్తున్నట్టు రాష్టప్రతి భవన్ అధికారులు తెలిపారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని ఆఖరు శాసనసభ మంగళవారంతో రద్దయ్యింది.