రాష్ట్రపతి ముర్ముకి జగన్ ప్రభుత్వం పౌర సన్మానం..!!
ఏపీలో రాష్ట్రపతి ముర్ము నేటి నుంచి రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్..సీఎం జగన్ తో పాటుగా మంత్రులు అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి పర్యటనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముర్ము తొలి సారి ఏపీకి వస్తున్నారు. దీంతో, సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రపతికి పౌర సన్మానం ఏర్పాటు చేసింది. తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు.
గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సన్మానిస్తారు. అనంతరం, విజయవాడలోని రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఈ విందులో సీఎం జగన్ తో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు అధికారులు పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం వేళ ముర్ము అమరావతికి వచ్చారు. తిరిగి ఇప్పుడు రాష్ట్రపతి హోదాలో వస్తున్నారు. ఇక, రాజ్ భవన్ నుంచి రాష్ట్రపతి విశాఖ కు వెళ్తారు. అక్కడ నేవీ డే ఉత్సావాల్లో పాల్గొంటారు. నేవీడేకు దేశ రాజధానిలో కాకుండా మరో ప్రాంతంలో రాష్ట్రపతి హాజరు కావడం భారత నౌకాదళ చరిత్రలో ఇదే ప్రథమం. డిసెంబరు 4న నేవీ డేను అన్ని నౌకాదళాలు నిర్వహిస్తాయి. ప్రధాన వేడుక ఢిల్లీలో జరుగుతుంది. ఈసారి రాష్ట్రపతి విశాఖపట్నంలో తూర్పు నౌకాదళం నిర్వహించే నేవీ డే లో రాష్ట్రపతి పాల్గొంటారు.
విశాఖలో రాష్ట్రపతికి స్వాగతం.. ఆతిథ్య ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి గుడివాడ అమర్ నాధ్ పర్యవేక్షిస్తారు. విశాఖ నుంచే రాష్ట్రపతి వర్చ్యువల్ విధానంలో ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అందులో ప్రధానంగా కర్నూలు జిల్లాలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ తో పాటుగా పలు జాతీయ రహదార్లు, నాలుగు ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలను రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. విశాఖలో నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న తరువాత ఈ రాత్రికి తిరుపతి చేరుకుంటారు. తిరుమలలో ఈ రాత్రికి బస చేస్తారు. సోమవారం శ్రీవారిని దర్శించుకుంటారు.ఆ తరువాత అలిపిరి గో శాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో కొద్ది సేపు అక్కడి విద్యార్ధులతో ముచ్చటిస్తారు. ఆ తరువాత రేణిగుంట నుంచి ఢిల్లీకి పయనమవుతారు.