విచారణ: సాక్షి, నమస్తే తెలంగాణలకు బాబు నో
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధికారిక మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణా పత్రికలు, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లను అనుమతించడం లేదన్న ఫిర్యాదులపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణకు ఆదేశించింది. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కేండేయ కట్జూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విషయంపై విచారణ కోసం సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ రంజన్ నాగ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో రాజీవ్ రంజన్ నాగ్తోపాటు సభ్యులుగా కె. అమర్నాథ్, ప్రజ్ఞానంద ఛౌదరి ఉంటారని ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన తెలిపింది.
నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ నుంచి ఈ విషయమై ఫిర్యాదులు వచ్చాయని, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాతనే విచారణకు నిర్ణయించినట్లు కట్జూ ఆ ప్రకటనలో తెలిపారు. ఈ తరహా చర్యలపై విచారణ చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో కట్జూ, కమిటీని ఆదేశించారు. ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కమిటీ మంగళవారం హైదరాబాద్ రానుంది.
తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడి మీడియా సమావేశాలకు నమస్తే తెలంగాణ, సాక్షి మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడంపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు.