రమ్మని కాంగ్రెసు నుంచి ఒత్తిడి: ఎర్రబెల్లి సంచలనం
హైదరాబాద్: తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసులోకి రావాలని తనపై ఒత్తిడి ఉందని, అయితే తాను తెలుగుదేశం పార్టీని వీడబోనని ఆయన అన్నారు. అన్నీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని ఎలా వీడుతానని ఆయన అన్నారు. పార్టీ మేధో మథన సదస్సులో ఆయన సోమవారం ప్రసంగించారు.
వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సరి, లేదంటే వ్యవసాయం చేసుకుంటానని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు జైత్రయాత్రలకు ప్రజలు రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైందని ఆయన అన్నారు. తమ పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి గ్రామంలో కనిపిస్తుందని ఆయన చెప్పారు.
తమ పార్టీ తెలుగు జాతి అభివృద్ధి కోసం పుట్టిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్నటి వర్షాలకు నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల రైతుల బాగా నష్టపోయారని ఆయన అన్నారు. వరద బాధితులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన అన్నారు. బాధిత రైతులకు తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
గత రెండు రచ్చబండ కార్యక్రమాల్లో ఏం చేశారని ప్రభుత్వం మళ్లీ రచ్చబండకు సిద్ధమైందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేక రచ్చబండ రచ్చరచ్చ అవుతుందని ఆయన అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను చైతన్యపరిచిన ఘనత తమ పార్టీదేనని ఆయన అన్నారు. నటుడు ఎవియస్ తమ పార్టీకి ఎంతో సేవ చేశారని, ఏవియస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.