బద్వేలులో పోలింగ్ ప్రారంభం - పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా : భారీ బందోబస్తు- తరలి వస్తున్న ఓటర్లు..!!
ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు శుక్రవారం చేరుకొని..ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ..బీజేపీ..కాంగ్రెస్ తో పాటుగా మొత్తం 15 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. హోరా హోరీగా ప్రచారం సాగింది. ఎవరికి వారు తమ విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
భారీ బందోబస్తు ఏర్పాటు
వాటిలో 221 కేంద్రాలను సమస్యాత్మకం అని భావించిన ఎన్నికల సంఘం... ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క మైక్రో అబ్జర్వర్ను నియమించింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వెబ్ కాస్టింగ్ సర్వర్తో అనుసంధానించారు. బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో కడప జిల్లా సరిహద్దుల్లో 23 చెక్పోస్టులు, నియోజకవర్గ సరిహద్దుల్లో 14 చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఒక్కో చెక్పోస్టులో పది మందిని నియమించామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి.
మెజార్టీ పైనే వైసీపీ ఫోకస్
అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 22 మంది ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నికకు 3 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే బద్వేలు లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రచారం చివరి నిమిషం వరకు పార్టీలు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి.
జిల్లా స్థాయి నుంచి సచివాలయం వరకు మానిటరింగ్
జిల్లా స్థాయింలో కంట్రోల్ రూంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును గమనిస్తున్నారు. కేంద్ర బలగాలను సైతం సిద్దంగా ఉంచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది.
Recommended Video
మాస్కు ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి
ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 22 మంది ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో కోవిడ్ను దృష్టిలో పెట్టు కుని అధికారులు ప్రత్యేక చర్య లు చేపట్టారు. ప్రధానంగా రెండు డోసుల టీకా పూర్తయిన వారిని మాత్రమే పోలింగ్ సిబ్బందిగా విధులు నిర్వర్తించేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఏజెంట్లు, సిబ్బంది కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు.