తిరుపతి లడ్డూ ప్రసాదాల ధర భారీగా పెంపు....
తిరుపతి: తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే ఎంత ఫేమసో అందరికి తెలిసిన విషయమే. రుచిగా శుచిగా పెద్దగా ఉండే శ్రీవారి లడ్డూని ఇష్టపడని ఆంధ్రులు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్వామి వారి భక్తులు ఈ లడ్డూలను మహా ప్రసాదం గా స్వీకరిస్తే భక్తులు కానివారు సైతం ఈ రుచిని ఎంతగానో ఆస్వాదిస్తూ తింటారు. అంతటి ప్రత్యేకమైన తిరుపతి లడ్డు ధర పెరిగిందన్న వార్త శ్రీవారి భక్తులకు నిరాశ కలిగించేదే...అలాగే ప్రసాదంలో భాగమైన వడ ధర ఏకంగా నాలుగు రెట్లు పెంచారట.
అయితే సాధారణంగా కౌంటర్లలో అందించే లడ్డు ధర పెంచడం కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పంపిణీ చేసే లడ్డూప్రసాదాల ధరనే పెంచడం ఊరట కలిగించేదే. తిరుపతి ధర లడ్డూల ధర పెంచాలని టిటిడి అధికారులు నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేశ వ్యాప్తంగా నిర్వహించే కల్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలు, భక్తి కార్యక్రమాలకు సప్లయ్ చేసే లడ్డూల ధరలను టిటిడి అధికారులు పెంచారు.
ధరల వివరాలు చూస్తే చిన్న లడ్డూ ధర రూ. 25 నుంచి రూ. 50కి పెంచామని, కల్యాణం లడ్డూ ధర రూ. 100 నుంచి రూ. 200కి పెంచామని తెలిపారు. వడ ధర రూ. 25 నుంచి రూ. 100కి పెంచినట్లు వెల్లడించారు. అలాగే ఇకనుంచి సిఫార్సులపై ప్రసాదాలు ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలని టీటీడీ నిర్ణయించింది. రూ. 50 లడ్డూలను భక్తులకు కోరినన్ని ఇచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు.