నెల్లూరు నగరంలో త్వరలో అలరించనున్న...ప్రైవేట్ ఎఫ్.ఎమ్.రేడియో ప్రసారాలు
నెల్లూరు: త్వరలో నెల్లూరు నగర వాసులను ఎఫ్.ఎమ్.రేడియో ప్రసారాలు అలరించనున్నాయి. తాజా సమాచారం ప్రకారం నెల్లూరులో మూడు ప్రైవేట్ ఎఫ్.ఎమ్.రేడియో ఛానల్స్ ఏర్పాటుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ క్రమంలో నెల్లూరు నగరంలో ఎఫ్.ఎం రేడియో ఛానెల్స్ ఏర్పాటు చేయాలనే ఆసక్తి కలిగిన పారిశ్రామికవేత్తలు తమ దరఖాస్తులు పంపాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా ఎఫ్ ఎం రేడియోస్టేషన్ల కోసం నిర్వహించిన వేలంలో 66 ఛానళ్లు అమ్ముడుపోగా...వాటిల్లో రామోజీకి చెందిన ఈనాడు గ్రూప్ సంస్థలు వరంగల్ లో రెండు.. తిరుపతి.. విజయవాడలలో ఒక్కొక్కటి చొప్పున ఛానళ్లను సొంతం చేసుకున్నాయి. ఇది దేశ వ్యాప్తంగా నిర్వహించిన మూడోదశ వేలం కాగా వాటిలో రెండో బ్యాచ్ ఫలితాల్ని కేంద్ర సమాచార శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 92 నగరాలు, పట్టణాల కోసం మొత్తం 266 ఎఫ్ఎం స్టేషన్లను వేలం పెట్టగా వాటిలో 66 ఛానళ్లు అమ్ముడయ్యాయి. అయితే మరోవైపు 200
ఎఫ్.ఎం స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం గమనార్హం. ఇక తాజాగా అమ్ముడైన ఎఫ్ ఎం స్టేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఆదాయం సమకూరనుంది.
ఒక కమ్యూనిటీ రేడియోలు, ప్రైవేటు ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ద్వారా వార్తల ప్రసారానికి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రైవేట్ ఎఫ్ ఎం రేడియోలో వార్తల ప్రసారం విషయమై కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా...సుప్రీం కోర్టు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. అ యితే అలా అనుమతి ఇవ్వడంలో దేశ భద్రతా ముప్పు పొంచి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ప్రైవేట్ సంస్థలకు వార్తా ప్రసారాల అనుమతులిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రెచ్చగొట్టే...విద్వేషపూరిత వార్తలు వెనువెంటనే ప్రజల్లోకి వెళ్లిపోవచ్చని...దీనివల్ల దేశ అంతరంగిక భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని కేంద్రం నివేదించింది.












Click it and Unblock the Notifications