అమ్మ ఒడిపై ప్రైవేటు విద్యాసంస్థల కన్ను: నిధుల స్వాహా కోసం అప్పుడే ధందా
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పథకం అమ్మ ఒడి. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే.. అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి 15 వేల రూపాయలను ప్రభుత్వం వారికి కానుకగా చెల్లిస్తుంది. గ్రామాలు, మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావడం, మధ్యలో బడి మాని వేయడాన్ని తగ్గించడం, పేద పిల్లలకు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల ద్వారా చదువును చెప్పించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఈ పథకాన్ని రూపొందించారు.
ప్రభుత్వం ఇంకా కుదురు కోనే లేదు. ఈ పథకాన్ని ప్రైవేటు స్కూళ్లు, విద్యాసంస్థలకు అమలు చేస్తారో, లేదో కూడా తెలియదు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు ఇంకా వెలువడనే లేదు. అప్పుడే తమ వ్యాపారాన్ని మొదలు పెట్టేశాయి కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు.

తమ స్కూలులో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని, దీన్ని అమలు చేయడానికి తాము ప్రభుత్వం నుంచి గుర్తింపు తెచ్చుకున్నామంటూ ప్రచారం చేయడాన్ని ఆరంభించాయి. పిల్లలను తమ స్కూలులో చేర్పిస్తే.. అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి 15 వేల రూపాయలను పొందవచ్చని అంటూ కృష్ణా జిల్లాకు చెందిన గాయత్రి విద్యాసంస్థల యాజమాన్యం ప్రచారాన్ని ఆరంభించింది. దీనిపై బ్యానర్లను కట్టి మరీ తల్లిదండ్రులకు గాలం వేస్తోంది. ప్రభుత్వ పథకాన్ని ఆశగా చూపించి.. తమ స్కూలులో విద్యార్థుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

నిజానికి- అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేటు స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలకు వర్తింపజేయాలని విద్యాశాఖ నిర్ణయించలేదు. ఈ పథకాన్ని పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్త వైభవాన్ని తీసుకుని రావాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. దీన్ని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు తమ స్వార్థం కోసం వినియోగించుకునే పనిలో పడ్దాయి.












Click it and Unblock the Notifications