డిగ్రీలో చేరండి... డబ్బు, స్మార్ట్ఫోన్ పొందండి: ప్రైవేట్ డిగ్రీ కాలేజీల ఆఫర్లు!
కడప:నిన్నటిదాకా ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల కోసం ఆఫర్లతో వెంటబడితే ఇప్పుడు ఈ జాబితాలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కూడా చేరాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని పుట్టగొడుగుల్లా విద్యాసంస్థలు వెలిశాయి.
లెక్కకుమించి పెరిగిపోయిన ఇంజనీరింగ్ కాలేజీలతో డిమాండ్ తగ్గిపోవడం...స్టాండర్డ్స్ లేమి కారణంగా ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం...ఇలా వివిధ కారణాలతో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులు లేక మూతపడుతున్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి ప్రైవేటు డిగ్రీ కళాశాలకు వచ్చింది. ఈ కాలేజీ సంఖ్య తక్కువే అయినా డిగ్రీ కోసం తమ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోవడంతో విద్యార్థులను ఆకర్షించేందుకు వీరి స్కీమ్ లు మొదలయ్యాయి.
మా కాలేజీలో చేరండి...రూ.6 వేలు డబ్బులే తీసుకోండి... అంతేకాదు మీతో పాటు మీ ఫ్రెండ్స్ నో బంధువులనో మరో నలుగురిని జాయిన్ చెయ్యండి...మంచి స్మార్ట్ ఫోన్ ను కూడా సొంతం చేసుకోండి. ఇవీ ప్రస్తుతం ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లు విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్లు. అలా ఇస్తే వీరికి ఎలా గిట్టుబాటు అవుతుందనా మీ డౌట్...అదేనండి...ఉందిగా ఫీ రీఎంబర్స్ మెంట్ సదుపాయం. అదే ఈ కాలేజీల చేత ఆ ఆఫర్లు పలికిస్తోంది.
ప్రభుత్వం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందుతుంది. కోర్సును బట్టి రీయింబర్స్మెంట్ వస్తుంది. బీకాం, బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్ గ్రూపులకు రూ.15,076 రీయింబర్స్మెంట్ వస్తుంది. అర్హులైన వారికి స్కాలర్షిప్ అందుతుంది. కళాశాలల మధ్య పోటీ వుండడంతో నేరుగా కాలేజీలు విద్యార్థులకే వలవేసి డబ్బులు, మొబైల్ఫోన్లు ఎర చూపుతున్నారు. మరి కొన్ని కాలేజీలు ఇంటర్మీడియట్ కళాశాలలతో సంబంధాలు పెట్టుకొని ఆ కాలేజీలో పాసైన విద్యార్థులను డిగ్రీ కాలేజీలో చేర్చేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లు ఆ కళాశాలకు బహుమతులను అందిస్తున్నారు.
ఇలా విద్యార్థుల కోసం డిగ్రీ కాలేజీలు సైతం ఆఫర్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ ట్రెండ్ కడప జిల్లా యోగివేమన యూనివర్శిటీ పరిధిలో జోరుగా సాగుతోంది. యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో 91 డిగ్రీ కళాశాలలు వున్నాయి. వీటి మధ్య పోటీ బాగా పెరిగిపోవడంతో విద్యార్థులను ఆకర్షించేందుకు ఆయా కాలేజీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు రూ.6 వేలను ఇస్తామంటు ఈ కాలేజీల ప్రతినిథులు రంగంలోకి దిగారని సమాచారం.
అంతేకాదు...షరామామూలుగానే ఈ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా విద్యార్థులను చేర్పించే బాధ్యతను...అందుకుగాను బంపర్ ఆఫర్లను ఇస్తున్నాయి. పది మంది విద్యార్థులను తీసుకువచ్చిన వారికి మోటారు బైకు ఇస్తామంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేనా పులివెందుల నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన కళాశాల విద్యార్థులు పులివెందుల ప్రాంతంలోని డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు తీసుకున్నారు. అందుకు ప్రతిఫలంగా జూనియర్ కళాశాలకు ఆ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఓ కారును బహుమతిగా ఇచ్చినట్లు చెబుతున్నారు.
అదే మండలానికి చెందిన ఇంకో కళాశాల యాజమాన్యానికి బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే అడ్మిషన్ల కోసం పోటీ ఎంత వుందో అర్థమవుతుంది. ప్రొద్దుటూరు, రాయచోటి, జమ్మలమడుగు ప్రాంతాల్లోని కొన్ని డిగ్రీ కాలేజీలు డిమాండ్ను బట్టి విద్యార్థులకే నేరుగా నజరానా ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కాలేజీలు రూ.6 వేలతో పాటు స్కాలర్షిప్ లు కూడా విద్యార్థులకే ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారట.
కడపలోని ఓ కళాశాల యాజమాన్యం సిబ్బందికి అడ్మిషన్ల టార్గెట్ పెట్టినట్లు చెబుతారు. ఎక్కువ అడ్మిషన్లు చేసిన సిబ్బందికి బైకులు, మొబైల్ఫోన్లు ఇచ్చినట్లు ప్రచారం వుంది. మైదుకూరు ప్రాంతంలోని జూనియర్ కళాశాలలో వున్న విద్యార్థులు తమ డిగ్రీ కళాశాలలోనే చేరాలని అక్కడి యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. వేంపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థినులు రాయచోటిలోని ఓ కళాశాలలో చేరారు. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో ఆ విద్యార్థినులు వెనక్కు వచ్చారు. టీసీలు ఇవ్వాలని యాజమాన్యాన్ని అడిగితే ఇచ్చేదిలేదంటూ బెదిరిస్తున్నారని ఆ విద్యార్థినులు వాపోతున్నారు. ఇదీ ప్రస్తుతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పరిస్థితి.