తెలుగుదేశం పార్టీ నాయకుణ్ని చంపేసినట్లే నన్ను కూడా చంపేస్తారా?
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ నాయకుడు నందం సుబ్బయ్యను చంపేసినట్లే నన్ను కూడా చంపేస్తారా? అంటూ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి, రాజుపాళెం మాజీ జడ్పీటీసీ భాస్కర్ ప్రశ్నించారు. వెల్లాల నుంచి టూవీలర్ మీద ప్రొద్దుటూరుకు వస్తున్న సమయంలో సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్గీయులు దాడిచేసి బెదిరించారని భాస్కర్ మీడియాకు వెల్లడించారు. రామాపురం గ్రామానికి చెందిన యాకోబ్ తోపాటు మరికొందరు ఉన్నారని తెలిపారు.
ప్రొద్దుటూరులో నియంతగా పరిపాలన చేయాలనుకుంటున్న వ్యక్తులు జడ్పీటీసీలను, కౌన్సిలర్లను, మాజీ ఎంపీటీసీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన భార్య రాజుపాళెం మండలం పగిడాల ఎంపీటీసీ సభ్యురాలని, బెదిరించడానికి వచ్చిన వ్యక్తులు తన భార్య చేత పదవికి రాజీనామా చేయించాలన్నారని, లేదంటే రూ.11 లక్షలు కట్టాలని డిమాండ్ చేశారన్నారు. గెలిస్తే డబ్బులివ్వాలా? అని తాను ప్రశ్నించానని, ఎమ్మెల్యే తనకు డబ్బులివ్వలేదని, రౌడీలతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు.
తానడిగే ప్రశ్నలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని కొట్టడానికి, దౌర్జన్యాలు చేయడానికి నిన్ను ఎమ్మెల్యేను చేశామా? అంటూ భాస్కర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో భాస్కర్ తో పాటు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ప్రొద్దుటూరు 5వ వార్డు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ అనుచరులు దుగ్గిరెడ్డి రఘనాథ్ రెడ్డి, ప్రసాద్ తదితరులున్నారు.