దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తాం..!! జగన్ ఇంటి దగ్గర బుడతడి హల్ చల్..!
అమరావతి: ఏపి పాలన పట్టాలెక్కినట్టు కనిపిస్తోంది. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనపై పట్టు సాధించేందుకు అధికారిక సమీక్షలకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, చేపట్టాల్సిన సంస్కరణలపై అధికారులతో చర్చించారు. ఆర్థిక శాఖతో పాటు ఆదాయవనరులు సమకూర్చే శాఖలపై కూడా సమీక్ష నిర్వహించారు. పలు పథకాల అమలుపై కూడా సమీక్ష చేపట్టారు. ఇప్పటికే మొదటి సంతకం వృద్ధుల పింఛన్లపై చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష..! ఆదాయ మార్గాలు చూడాలని సూచన..!!
రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకున్నారు. మద్యం నిషేధానికి కట్టుబడి ఉన్నామని జగన్ పునరుద్ఘాటించారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీ మేరకు ఏపీలో ఉన్న బెల్టు షాపులను ఎత్తివేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
నిధుల కొరత లేకుండా చూడాలి..! ప్రజలపై బారం వద్దన్న సీఎం..!!
ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలనీ, ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని పునరుద్ఘాటించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారుల్ని సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. గొలుసు దుకాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
సీఎం జగన్ ఇంటి ముందు బుడతడు..!అనుమానాస్పదంగా తిరిగిన బాలుడు..!!
పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లోకి ఓ పదేళ్ల బాలుడు రావడం, దర్జాగా అక్కడ తిరుగుతుండడంతో భద్రతా సిబ్బందిలో ఒక్కసారిగా కలకలం ప్రారంభమైంది. దీంతో పోలీసులు ఆ బాలుడిని తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పదేళ్ల వయసున్న ఆ బాలుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వారిని సైతం ఎదురుప్రశ్నలు వేసి ముప్పతిప్పలు పెట్టాడు. తన పేరు శివకుమార్ అంటున్న ఆ కుర్రాడు.. తమది బాలతిమ్మయ్యగారి పల్లె అని చెబుతున్నాడు. ఈ గ్రామం ఏ జిల్లాలో, ఏ మండల పరిధిలో ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
అనాధాశ్రమానికి వెళ్లనన్న బాలుడు..! పోలీసులనే ప్రశ్నించిన బుడ్డోడు..!!
ప్రస్తుతానికి బాలుడిని శిశు సంరక్షణ కేంద్రం లేదా అనాథ బాలల ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. అయితే అనాథ ఆశ్రమానికి వెళ్లేందుకు బాలుడు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అసలీ బాలుడు ముఖ్యమంత్రి ఇంటికి ఎలా వచ్చాడు, అతనితో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణ తెలిపారు. బాలున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. పోలీసులకే ఎదురుప్రశ్నలు వేస్తున్న బాలుడు. ఐతే బాలుడు ఎవరు ఎక్కడ నుండి వచ్చాడనే అంశాలపై ఆరా తీస్తున్న పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా అనాథ ఆశ్రమానికి వెళ్లడానికి బాలుడు మొండికేస్తున్నట్టు తెలుస్తోంది.