ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి..అక్రమ కేసులు అన్యాయం .. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజా పరిణామాల నేపథ్యంలో ఘాటుగా లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జరుగుతున్న వరుస అరాచకాలను ఏకరువు పెడుతూ ఆయన మండిపడ్డారు. టిడిపి నాయకులపై తప్పుడు కేసులు నిరసనగా లేఖ రాసిన చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను బలికాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకే .. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆక్రోశం
అక్రమ కేసులపై ఏపీ డీజీపీకి ఘాటు లేఖ రాసిన చంద్రబాబు
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరాచక పాలన కొనసాగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. దళితులపై దాడులు- దౌర్జన్యాలు, టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు,అరెస్ట్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం,ఇక ఇప్పుడు అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయడం ఇలా వరుసగా అనేక కేసులు పెట్టడంపై చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ప్రశ్నించారు.
కక్ష సాధించడమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయం
బడుగు బలహీన వర్గాల ప్రజలు, నాయకులపై కక్ష సాధించడమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని,అలాంటి ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని చంద్రబాబు హితవు పలికారు.20ఏళ్లు ప్రజాసేవలో ఉన్న దళిత వైద్యుడు సుధాకర్రావుపై ,తర్వాత మరో దళిత మహిళా డాక్టర్ అనితారాణిపై కక్ష సాధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా బీసీలపై వైసీపీ ప్రతీకారం తీర్చుకుంటోందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో టిడిపి నాయకులు వేధిస్తున్నారని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
అక్రమ అరెస్ట్ లతో బీసీ వర్గాలకు షాక్
అచ్చెన్నాయుడు అరెస్ట్ నుండి తేరుకోకముందే,అయ్యన్నపాత్రుడుపై కేసులు పెట్టడం బీసీ వర్గాలకు షాక్ కి గురి చేస్తుందని చాలా నిజాయితీపరుడైన,ఎవరినీ నొప్పించని నాయకుడైన అయ్యన్నపాత్రుడు ని ఏ విధమైన విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ దురుద్దేశానికి నిదర్శనమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్లిష్ట ప్రయోజనాల కోసం పోలీసులు, వైసిపి నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమని ఆయన పేర్కొన్నారు.అయ్యన్నపాత్రుడుపై నిర్భయకేసు నమోదు చేయడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణ
పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా అధికార పార్టీ నేతలు చెప్పినట్టు పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం అయ్యన్నపాత్రుడిదని, మచ్చలేని నాయకుడైన అయ్యన్నపాత్రుడు పై కావాలని తప్పుడు ప్రచారం చేసి ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు. తన సొంత మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా టిడిపి నాయకుల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా అప్రతిష్టపాలు చేసి, తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఇక వారికి సహకరిస్తున్న పోలీసులు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
వైసీపీ కక్ష సాధింపు ధోరణి ప్రజాస్వామ్యానికి పెను విఘాతం
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇదే తంతు జరుగుతోందని ఆయన అన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుందుడుకు చర్యలు ఇదే విధంగా కొనసాగితే, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం, పోలీసులు కూడా సహకరిస్తే పరిస్థితి దారుణంగా మారుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. వైసిపి కక్షసాధింపు ధోరణి రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తోందని, ప్రజాస్వామ్యానికి పెను విఘాతంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం నాలుగు మూలస్తంభాలైన లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడీషియరీ ,మీడియాను వైసిపి నాశనం చేస్తోందని విమర్శించారు చంద్రబాబు.
Recommended Video
వ్యాధిగ్రస్తమైన రాజ్యానికి ఈరోజు మీరిచ్చే చికిత్సే రేపటి చరిత్రలో న్యాయ నిర్ణేత
ఇక ఈ పరిస్థితులు మారకుంటే వైసీపీ చేతిలో కకావికలమైన వ్యవస్థలనే భావితరాలకు వారసత్వంగా సంక్రమించే ప్రమాదముందని ఆయన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ అధిపతిగా ప్రజాస్వామ్య వ్యవస్థలు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత డిజిపి మీద ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక శాంతిభద్రతలే సమిష్టి పౌర వ్యవస్థకు ఔషధమని పేర్కొన్నారు. ఎప్పుడైతే రాజ్యం వ్యాధిగ్రస్తం అవుతుందో తక్షణమే ఔషధాన్ని అందించాలని అంబేద్కర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. రాజకీయ కక్ష సాధింపులు కారణంగా రాష్ట్రంలో పౌర వ్యవస్థ వ్యాధిగ్రస్తమైన ని అంబేద్కర్ చెప్పినట్లుగా ఔషధం అందించాల్సిన బాధ్యత శాంతి భద్రతల శాఖదే అని సూచించారు. ఇక ఈరోజు వ్యాధిగ్రస్తమైన రాజ్యానికి ఈరోజు మీరిచ్చే చికిత్సే రేపటి చరిత్రలో న్యాయ నిర్ణేత అన్న అంబేద్కర్ సూక్తిని తమ దృష్టికి తీసుకువస్తున్నాను అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.