విశాఖకు జగన్!, పవన్ మద్దతు: పోలీసుల దిగ్బంధంలో ఆర్కే బీచ్, హై అలర్ట్
ఆర్కే బీచ్ వేదికగా గురువారం ప్రత్యేక హోదా కోసం భారీ ఎత్తున నిరసనలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
విశాఖపట్నం: నగరంలోని ఆర్కే బీచ్ వేదికగా గురువారం ప్రత్యేక హోదా కోసం భారీ ఎత్తున నిరసనలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గురువారం నగరంలోని ఆర్కే బీచ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టనుండగా, అక్కడ జరిగే ప్రజల పోరాటానికి పవన్ ఇప్పటికే తన మద్దతు పలికారు.
కాగా, విపక్షాలు, ఆంధ్ర యువత మౌన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో నగరంలో 144 సెక్షన్ను విధించింది పోలీసు శాఖ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శనకు మంగళవారమే పోలీసులు అనుమతి నిరాకరించారు.
అయితే, ప్రత్యేక హోదా కోసం ఆంధ్రా యువత పేరుతో విశాఖ బీచ్లో మౌనదీక్షకు పిలుపునివ్వడం, దీనికి జనసేన అధినేత పవన్కల్యాణ్ సంఘీభావం, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర సంఘాలు మద్దతు ప్రకటించడం, ఆర్కేబీచ్లో వైసీపీ నిర్వహించే కొవ్వొత్తుల ప్రదర్శనకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ హాజరవుతానని ప్రకటించడంతో నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ ప్రకటించారు.
ఎలాంటి ప్రదర్శనలకూ అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. కాగా, జనవరి 27, 28 తేదీల్లో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నాయి. దీనికి దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, వివిధ ప్రభుత్వా ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు హాజరవుతున్నారు. సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందుగా అదే ప్రాంతంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలకు పలువురు సిద్ధం కావటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే భారీగా బలగాలను మోహరించారు.
మంగళవారం రాత్రి నుంచే కార్యరంగంలో దిగిన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు. బుధవారం ఉదయానికే కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్కేబీచ్, వైఎంసీఏ, వుడా పార్కు ప్రాంతాలను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. పెదజాలరిపేట నుంచి రుషికొండ వరకు కూడా తీర ప్రాంతం వైపునకు ఎవరూ వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. నగరంలో బుధవారం నుంచే హై అలెర్ట్ అమల్లో ఉన్నట్టు ప్రకటించారు.
కాగా, మౌనదీక్షను ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యక్షంగా వీక్షించేలా సామాజిక మధ్యమాన్ని ఉపయోగించుకోవాలని ఆంధ్రా యువత ఏర్పాట్లు చేసుకుంటోంది. అదే విధంగా వైసీపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆర్కేబీచ్ నుంచి పార్కు హోటల్ ముందున్న వైఎస్ఆర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. దీనికి హాజరయ్యేందుకు జగన్ వస్తే ఆయన్ను వెంటనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ నిరసనల కార్యక్రమాల నేపథ్యంలో విశాఖలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.