అంబేద్కర్ జిల్లాపై విపక్షాల యూటర్న్-ఇరుకునపడ్డ వైసీపీ- ఇతర జిల్లాలకూ పాకిన నిరసనలు
ఏపీలోని కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాకరేపుతోంది. దీనిపై నిన్న అమలాపురంలో భారీ ఎత్తున నిరసనలతో పాటు విధ్వంసం కూడా చోటుచేసుకుంది. విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఈ విషయంలో వైసీపీ సర్కార్ తీరును తప్పుబడుతున్నాయి. దీంతో వైసీపీ ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా పేరును తిరిగి వైసీపీ మారుస్తుందన్న ఆందోళనతో పొరుగు జిల్లాల్లోనూ నిరసనలు మొదలయ్యాయి.
కోనసీమ మంటలు
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నిన్న అమలాపురంలో ఎస్సీయేతర కులాలకు చెందిన కొందరు నిరసనలకు దిగారు. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకూ, హింసకూ దారితీసింది. ఇందులో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లూ దగ్ధమయ్యాయి. దీంతో ఈ ఆందోళనల్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని అదుపులోకి తెచ్చింది. దీంతో పాటే అంబేద్కర్ జిల్లాపేరు కూడా కొనసాగుతుందని ప్రకటించింది. అయితే విపక్షాలు మాత్రం దీనిపై యూటర్న్ తీసుకున్నాయి.
విపక్షాల యూటర్న్
అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని గతంలో సమర్ధించిన విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయి. అయితే ఆ విషయం నేరుగా చెప్పకుండా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ పేరు జిల్లాకు పెట్టడం తప్పుకాదని, అయితే ఆ పని ముందే చేయాల్సిందని, దీనిపై ఇతర వర్గాల్ని కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు ఒప్పించాల్సిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇధే వాదనను బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కూడా వినిపించారు. టీడీపీ కూడా దీనిపై పరోక్షంగా విమర్శలకు దిగింది.
ఒంటరైన వైసీపీ
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుపై ఇతర పార్టీలు అన్నీ అంగీకరించిన తర్వాతే వైసీపీ సర్కార్ పేరు మార్చింది. ఇప్పుడు ఆయాపార్టీలన్నీ వెనక్కి తగ్గాయి. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయకపోయినా ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం సమర్ధిస్తున్నట్లు చెప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఈ వ్యవహారంలో ఒంటరిగా మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అంబేద్కర్ పేరుపై వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నా ఎస్సీల్లో మాత్రం నమ్మకం కుదరడం లేదు.
ఇతర జిల్లాలకూ నిరసనలు
అంబేద్కర్ జిల్లాపేరుపై కోనసీమ జిల్లాలో రగిలిన చిచ్చు ఇప్పుడు ఇతర జిల్లాలకూ పాకుతోంది. నిన్నటి హింసను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కోనసీమ జిల్లాపై ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు మిగతా జిల్లాల్లో అంబేద్కర్ జిల్లా పేరుకు అనుకూల,వ్యతిరేక నిరసనలు పాకుతున్నాయి. ఇవాళ గుంటూరుతో పాటు కాకినాడ, ఇతర జిల్లాల్లో సైతం అంబేద్కర్ పేరు మార్చొద్దంటూ దళిత సంఘాలు నిరసనలకు దిగాయి. ప్రభుత్వం దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేయకపోతే మాత్రం ఈ నిరసనలు మిగతా జిల్లాలకూ పాకే సూచనలు కనిపిస్తున్నాయి.