వైసీపీ కుటుంబాన్ని చూసి గర్వపడుతున్నా- వైఎస్ జగన్ భావోద్వేగం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటినీ పలకరించారు ఆ పార్టీ నాయకులు. లబ్దిదారులను ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షులు.. ఇందులో విస్తృతంగా పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల కింద మంజూరయిన నిధుల వివరాలతో కూడిన బ్రోచర్లను లబ్దిదారులకు అందజేశారు. జగన్ పరిపాలనపై వారిలో నెలకొన్న అభిప్రాయాలను సేకరించారు.

ఈ కార్యక్రమం విజయవంతమైందని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. ఇందులో పార్టీపరంగా వైఎస్ఆర్సీపీ నియమించిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, జోనల్ ఇన్ఛార్జీలు, క్షేత్రస్థాయి వైసీపీ సైనికులు విస్తృతంగా పాల్గొన్నారు. వలంటీర్ల తరహాలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాల వివరాలను లబ్దిదారులకు వివరించడానికి వైఎస్ఆర్సీపీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఇవి.
అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, పింఛన్లు, ఆసరా, చేయూత, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా.. వంటి వివిధ సంక్షేమ పథకాల కింద మంజూరైన నిధుల గురించి సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, జోనల్ ఇన్ఛార్జీలు వారికి వివరించారు. అర్హత ఉండీ ఆయా లబ్ది పొందలేని వారి పేర్లను ఆయా పథకాల కింద నమోదు చేశారు. ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేస్తోందనే విషయాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, జోనల్ ఇన్ఛార్జీలు, క్షేత్రస్థాయి సైనికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటైంది. మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమంలో వచ్చిన ప్రజా స్పందన గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయగలిగామని చెప్పారు.
ఈ భేటీపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, జోనల్ ఇన్ఛార్జీలు, క్షేత్రస్థాయి సైనికులను కలుసుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. తమ సచివాలయ పరిధిలోని ప్రతి గడపను వారు సందర్శించారని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమలు పరుస్తోన్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళుతున్నారంటూ ప్రశంసించారు. వైసీపీ కుటుంబాన్ని చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications