Pulichintala : వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల గేటు- తెల్లవారు జామున ఘటన
గుంటుూరు జిల్లాలో కృష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్నిరోజులుగా పెరిగిన వరద ఉధృతితో ప్రాజెక్టు గేట్లలో ఒకటి కొట్టుకుపోయింది. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరద ప్రవాహం భారీగా రావడంతో 16వ నంబర్ గేటు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు.
Recommended Video
పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 గేట్లు ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకునే విధంగానే వీటిని నిర్మించారు. అయితే ప్రమాదవశాత్తూ భారీ వరద ప్రవాహాన్ని ఈ గేటు నిలువరించలేకపోయినట్లు తెలుస్తోంది. ఘటనపై వివరాలు తెలుసుకున్న జలవనరుల శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గేటును తిరిగి పెట్టాలంటే వరద ప్రవాహం తగ్గాల్సిందే. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వరద ప్రవాహాలు స్ధిరంగా కొనసాగే అవకాశముంది. దీంతో వరద తగ్గితే కానీ ఈ గేటు తిరిగి పెట్టేందుకు వీలు కాదని తెలుస్తోంది.

పులిచింతల ప్రాజెక్టును గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించారు. కేఎల్ రావు సాగర్ గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టులో ఎక్కువ నీళ్లు నిల్వచేస్తే అటు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలు మునిగే అవకాశం ఉండటంతో పూర్తిస్దాయిలో నిల్వ కూడా చేయడం లేదని తెలుస్తోంది. దీంతో సాగర్ నుంచి వచ్చే నీటిని దాదాపుగా కిందికి వదిలేస్తున్నారు. ఈ క్రమంలో గేటుపై భారం పెరిగి ఊడిపోయినట్లు చెబుతున్నారు. త్వరలో దీన్ని తిరిగి బిగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

కృష్ణానదిలో ప్రస్తుతం ఉన్న వరద సమయంలో గేటు విరగడంతో 2 లక్షల క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. దీంతో వెంటనే అధికారులు 16వ గేటు సహా 11,13,14,18,19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం పులిచింతల ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 44.53 టీఎంసీలుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 174.14 అడుగులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications